VILLAGE NAME PROBLEM IN SIDDIPET
'మా ఊరి పేరు మార్చండి సారూ' - మంత్రి పొన్నం ప్రభాకర్కు గ్రామస్థుల విజ్ఞప్తి.
తమ గ్రామం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బంది పడుతున్న ఓ గ్రామ ప్రజలు - ఆ ఊరి పేరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని దొంగల ధర్మారం - సమస్యను పరిష్కరించాలని మంత్రి పొన్నంకు విజ్ఞప్తి.
Village Name Problem In Siddipet District : కొన్ని గ్రామాల పేర్లు చెప్పగానే ఆ గ్రామాల్లో ఉన్న ప్రజల జీవన విధానం, కట్టుబాట్లు, ఆచారాలు వ్యవహారాలు ఇట్టే తెలిసిపోతాయి. కొంతమంది తమ స్వగ్రామాల పేర్లను సగర్వంగా చెప్పుకుంటారు. అయితే తమ గ్రామం పేరు చెప్పుకోవాలంటే తెలంగాణలోని ఓ గ్రామ ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆ గ్రామమే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని దొంగల ధర్మారం.
ఒకప్పుడు కరువు కాటకాలకు నిలయంగా :
గ్రామానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టే ఏ పథకాలైన, పనులైనా దొంగల ధర్మారం పేరిటే జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ గ్రామానికి రవాణా సౌకర్యం లేక కరువు కాటకాలకు నిలయంగా ఉండేది. గ్రామ ప్రజలు కడు పేదరికంలో జీవనం గడిపేవారు. రైతులు చౌడు భూముల్లో వ్యవసాయం చేయలేక తీవ్రమైన ఆకలితో అలమటించిపోయేవారు.
"మా ఊరి పేరు దొంగల ధర్మారం. మేము ఎక్కడికైనా వెళ్లి మా ఊరి పేరు చెబితే బాధాకరంగా అనిపస్తోంది. మా పూర్వీకులను ఈ పేరుకున్న చరిత్ర అడిగితే గతంలో ఆహారం దొరకకుండా ఉండటం, కనీస రవాణా సదుపాయాలు లేక కొందరు గ్రామస్థులు దొంగతనాలు చేసేవారని, దాంతో దొంగల ధర్మారం పేరు వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే పంచాయతీ విభాగం వారు ధర్మారం అని మార్చారు కానీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఇంకా మారలేదు. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఎలాగైనా చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము" -బిల్ నాయక్, ధర్మారం గ్రామస్థుడు, మాజీ జడ్పీటీసీ
గ్రామం పేరు చెప్పుకోవాలంటే ఇబ్బంది :
ఆకలికి తట్టుకోలేక, ఉపాధి మార్గం దొరక్కపోవడంతో వేరే మార్గం లేక కనీస అవసరమైన ఆహారం కోసం ఇక్కడి గ్రామ ప్రజలు పరిసర గ్రామాల్లో చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడేవారు. ఇలా ఆ ఊరికి దొంగల ధర్మారం అని పేరు వచ్చిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఏదైనా శుభకార్యాలకు వెళితే బంధువులు ఎవరినైనా పరిచయం చేస్తే మీది ఏ ఊరు అని అడిగితే దొంగల ధర్మారం పేరు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నామని, అవమానకరంగా ఉంటుందంటున్నారు.
మంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి :
గతంలో ఉన్న గ్రామ సర్పంచ్, పాలకవర్గం రికార్డుల నుంచి దొంగల ధర్మారం పేరును తొలగించాలని ఒక తీర్మానం కూడా చేశారు. రికార్డుల్లో ధర్మారం అనే పేరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని గత ఎంపీ, ఎమ్మెల్యేలకు విన్నవించామని చెబుతున్నారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితం మొత్తం శూన్యంగా ఉందని, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు.
COMMENTS