AMARNATH YATRA 2025
అమర్నాథ్ యాత్రకు 42వేల మంది జవాన్ల భద్రత- రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసా?
అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో కఠిన భద్రతకు కేంద్ర హోంశాఖ ఆదేశం- 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల మోహరింపు- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే!
Amarnath Yatra 2025 : అమర్ నాథ్ యాత్ర- ప్రతి శివ భక్తుడు కల! జీవితలో ఒక్కసారి అయినా అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే ఎక్కువ మంది కోరుకుంటారు. అక్కడ కొలువై ఉన్న శివుడిని చూసి దర్శించాలని పరితపిస్తారు. అయితే ఆ ప్రయాణం ఎంత కష్టమైనదైనా ఆనందంగానే ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా ఏటా అమర్నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటోంది.
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 3న మొదలై ఆగస్టు 9న ముగుస్తుంది. మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అమర్నాథ్ వెళ్లడానికి అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాం, గాందర్బల్ జిల్లాలోని బాల్తాల్ మీదుగా రెండు మార్గాలున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యటకులపై ఉగ్ర దాడి జరిగిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
భద్రత కోసం 581 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీలకు చెందిన 42,000 మంది జవాన్లు యాత్రా మార్గంలో భద్రతను పర్యవేక్షిస్తారు. కొన్ని కంపెనీల బలగాలు ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో మోహరించాయని, మిగిలిన 424 కంపెనీల భద్రతా సిబ్బంది వెంటనే యాత్రా మార్గంలో విధుల్లో చేరాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిందని గురువారం అధికార వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, అమర్నాథ్ యాత్ర యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ సర్కార్ కృష్టిచేస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పవిత్ర యాత్ర సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి అమర్నాథ్ యాత్ర కోసం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రకియ ప్రారంభమైంది. శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) వెబ్సైట్ లేదా దేశంలోని 540కిపైగా బ్యాంకుల్లో ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!
- SASB అధికారిక వెబ్సైట్ను సందర్శించి 'ఆన్లైన్ సేవలు' ఆప్షన్ క్లిక్ చేయాలి.
- డ్రాప్డౌన్ మెను నుంచి 'యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్' సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మార్గదర్శకాలను జాగ్రత్తగా చదివి అగ్రీ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- పేరు, యాత్ర తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ సహా వ్యక్తిగత వివరాలను పూరించాలి.
- పాస్పోర్ట్-సైజు ఫోటోగ్రాఫ్, తప్పనిసరి హెల్త్ సర్టిఫికేట్ (CHC) కాపీని అప్లోడ్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ నంబర్కు పంపిన OTPని ఉపయోగించి మీ మొబైల్ నంబర్ను వెరిఫై చేసుకోవాలి.
- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి (సుమారు రూ.220 ఉంటుంది).
- పేమెంట్ సక్సెస్ అయ్యాక రిజిస్ట్రేషన్ పర్మిట్ను డౌన్లోడ్ చేసుకోండి.
ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!
ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ను ఎంచుకునే యాత్రికులు నిర్దిష్ట బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లాక బ్యాంక్ అధికారులను సంప్రదిస్తే వాళ్లు మొత్తం వివరాలు చెబుతారు.
సాధారణంగా ఎంచుకున్న యాత్ర తేదీకి మూడు రోజుల ముందు, టోకెన్ స్లిప్లను వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ హాల్ ప్రదేశాల్లో పంపిణీ చేస్తారు. యాత్రికులు అధికారిక రిజిస్ట్రేషన్, వైద్య తనిఖీ కోసం మరుసటి రోజు సరస్వతి ధామ్కు వెళతారు. అదే సమయంలో జమ్ములోని RFID కార్డులను సేకరించాలి. ఆ తర్వాత యాత్ర ప్రారంభిస్తారు.
అవసరమైన పత్రాలు:
వైద్య ధ్రువీకరణ పత్రం: వైద్య సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే CHC పత్రం ఉండాలి.
యాత్ర అనుమతి పత్రం: రిజిస్ట్రేషన్ అయ్యాక జారీ చేస్తారు.
RFID కార్డ్: యాత్రికుల ట్రాకింగ్, భద్రతా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
ఆధార్ కార్డ్: భారతీయ పౌరులకు అవసరం; NRIలు తప్పనిసరిగా పాస్పోర్ట్ పట్టుకోవాలి.
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు: అధికారిక పత్రాల కోసం ఇటీవల తీసిన ఆరు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అవసరం.
మొబైల్ నంబర్: అధికారిక సమాచార మార్పిడికి చెల్లుబాటు అయ్యే నంబర్ ఉండాలి. ఈ మార్గదర్శకాలను పాటించడంతోపాటు అవసరమైన పత్రాలను తీసుకుని వెళ్లడం వల్ల సురక్షితమైన, సంతృప్తికరమైన అమర్నాథ్ యాత్ర చేయవచ్చు.
COMMENTS