RGUKT 2025 ADMISSIONS NOTIFICATION
బాసర 'ట్రిపుల్ ఐటీ' ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - చివరి తేదీ ఎప్పుడంటే
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - మే 31వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.
RGUKT 2025 Admissions Notification : రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక యూనివర్సిటీ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. యూనివర్సిటీ ఉపకులపతి గోవర్దన్ ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. మే 31వ తేదీ నుంచి జూన్ 21వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా ఆయన తెలిపారు. జులై 4వ తేదీన ప్రొవిజినల్ ఎంపిక జాబితాను ప్రకటించి జులై 7వ తేదీన తొలి దశ కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు సంబంధించిన అప్డేట్స్ను తమ అధికారిక వెబ్సైట్ https://www.rgukt.ac.in/ ద్వారా తెలుసుకోవచ్చని వీసీ సూచించారు.
పదిలో అత్యధిక మార్కులు సాధించిన వారు :
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులు ఆర్జీయూకేటీ బాసర (1500 సీట్లు), మహబూబ్నగర్ (180 సీట్లు) సెంటర్లలో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ పేద విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ను అందించడమే లక్ష్యంగా ఆర్జీయూకేటీలను 2008లో ప్రారంభించినట్లుగా వీసీ గోవర్దన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ప్రాఫెసర్ మురళీ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి :
ఇటీవల విడుదలైనటువంటి పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ రూల్స్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ను అనుసరించి రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ బడుల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 4 మార్కుల చొప్పున కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థులకు స్కోర్ సమానంగా ఉన్నట్లయితే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. తొలుత మ్యాథ్స్లో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్లో సాధించిన గ్రేడ్ను పరిశీలించి సీట్లు కేటాయిస్తారు. అవీ సమానంగా ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. అది కూడా సమానంగా ఉన్నట్లయితే హాల్టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
అప్లై చేయడం ఎలా
స్టెప్ 1 : తొలుత ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి. ఆ తర్వాత అన్ని వివరాలతో కూడిన దరఖాస్తు సబ్మిట్ చేశాక అప్లికేషన్ ఐడీ వస్తుంది.
స్టెప్ 2 : అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
స్టెప్ 3 : దరఖాస్తు ప్రింట్ తీసుకోవాలి.
స్టెప్ 4 : పీహెచ్/సీఏపీ/ఎన్సీసీ/స్పోర్ట్స్ కోటా అభ్యర్థులైతే తమ ఆన్లైన్ అప్లికేషన్ ఫారంను పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుం: ఓసీ/బీసీ కేటగిరిలకు చెందిన అభ్యర్థులకు రూ.500;
ఎస్సీ/ఎస్టీలకు రూ.450, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకైతే రూ.1500
భర్తీకాని గ్లోబల్ కేటగిరీ సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే రూ.1500 చొప్పున అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
ఒక వేళ ఎన్నారై/ఇంటర్నేషనల్ అభ్యర్థులైతే 100 డాలర్లు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ రుసుం టీఎస్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు ఎవరైనా చేస్తే లేటెస్ట్గా చేసిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు.
అప్లికేషన్తో పాటు సంబంధిత ధ్రువపత్రాలను జూన్ 25లోగా స్పీడ్పోస్టు/రిజిస్టర్ పోస్టు ద్వారా (ది కన్వీనర్, యూజీ అడ్మిషన్స్ 2025-26, ఆర్జీయూకేటీ -బాసర, నిర్మల్ జిల్లా, తెలంగాణ- 504107) చిరునామాకు పంపాలి.
COMMENTS