CID REPORT ON KIDNEY ROCKET CASE
కిడ్నీ అమ్ముకున్నాడు - లాభాలు చూసి 'ఆపరేషన్' స్టార్ట్ చేశాడు.
సరూర్నగర్ కిడ్నీ రాకెట్ కేసులో విస్తుపోయే విషయాలు - శ్రీలంక నుంచే 'ఆపరేషన్' - ప్రధాన నిందితుడి కోసం ముమ్మర గాలింపు.
Saroornagar Kidney Rocket Update : హైదరాబాద్ సరూర్నగర్లో సంచలనం రేపిన అక్రమ కిడ్నీ మార్పిడీ దందాలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందాను ఆపరేట్ చేసినట్లు తాజాగా దర్యాప్తులో వెల్లడైంది. శ్రీలంకలో ఓవైపు కేసినో నిర్వహిస్తూనే, మరోవైపు భారత్లో కిడ్నీ దందాను సాగించినట్లు తేలింది. తొలుత సరూర్నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఏపీలోని విశాఖకు చెందిన పవన్ గురించి ఆరా తీస్తోంది.
పవన్ తొలుత ఇలాంటి మరో కిడ్నీ రాకెట్ ముఠా వలకు చిక్కి, తానే స్వయంగా కిడ్నీ అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఆదే సమయంలో దందా గురించి తెలుసుకుని కిడ్నీ దాతల కంటే దళారులకే ఎక్కువ లాభం వస్తున్నట్లు గుర్తించాడు. తమిళనాడులో కొందరు ఏజెంట్లను నియమించుకుని, ఆర్థిక ఇబ్బందులున్న వారిని గుర్తించే పనిని అప్పగించాడు. మరికొందరు ఏజెంట్ల ద్వారా కిడ్నీ అవసరమయ్యే వారి సమాచారాన్ని సేకరించాడు. మరోవైపు చిన్న చిన్న ఆసుపత్రులను ఏర్పాటు చేసి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాజమాన్యాలను గుర్తించి మచ్చిక చేసుకునే వాడు. కమీషన్ ఆశ చూపి శస్త్రచికిత్సలు చేయించేవాడు. ఇలా ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.
లాభాలు చూసి దందాలోకి :
ఒక్కో కిడ్నీ మార్పిడికి గ్రహీతల నుంచి రూ.50-60 లక్షలు వసూలు చేసి, దాతలకు రూ.5 లక్షలు, శస్త్రచికిత్స చేసిన వైద్యులకు రూ.10 లక్షలు, ఆసుపత్రి యాజమాన్యానికి రూ.2.5 లక్షలు, సిబ్బందికి రూ.1.5 లక్షల వరకు ఇచ్చేవాడు. అంతాపోనూ రూ.30 లక్షలకు పైగా మిగులుతుండటంతో దందాను విస్తరించాడు. ఒకచోట వ్యవహారం బయటకు పొక్కితే, దందాను మరోచోటుకు మార్చేవాడు. ఇలా ఇంతవరకు శ్రీలంక, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరుల్లో దందా నడిపాడు. ఒకచోట కేసులు నమోదైతే మరో చోటుకు మకాం మార్చాడు. ఇలా 4 ప్రాంతాల్లో కేసులు నమోదు కావడంతోనే హైదరాబాద్కు మకాం మార్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే పవన్ ముఠాలో పని చేసిన వైద్యులు ఇద్దరి పేర్లూ ఒకటేనని వెల్లడైంది. తొలుత శస్త్రచికిత్సలు చేసిన డా.రాజశేఖర్ వయోభారంతో తప్పుకోగా, అనంతరం నెల్లూరుకు చెందిన డా.పెరుమాళ్ రాజశేఖర్ ఈ దందాలో చేరినట్లు గుర్తించారు.
అతడు చిక్కితేనే :
సరూర్నగర్లో గత జనవరిలో పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం పవన్ శ్రీలంక నుంచి హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు సమాచారం. అప్పటికి లుక్ అవుట్ నోటీస్ జారీ కాకపోవడంతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అతను చిక్కితే ఈ ముఠాకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడవుతుందని భావిస్తున్న సీఐడీ, పవన్ను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు దర్యాప్తును ప్రారంభించిన సీఐడీ కొద్దిరోజుల్లోనే కిడ్నీ దాతలను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన తమిళనాడుకు చెందిన ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీఐడీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
COMMENTS