MOTHER KILLS CHILDREN
తల్లి ఆడిన కిడ్నాప్ కథ - 80 రోజుల పసికందు అని చూడకుండా
తల్లి ఒడిలో బిడ్డను అపహరించిన దుండగుల కేసులో కీలక పరిణామం - తల్లే హంతకురాలని తేల్చిన పోలీసులు - చంపేసి బావిలో పడేసిన తల్లి.
Mother Kills Child : నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మరిచి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందు అని చూడకుండా బావిలో పడేసి తల్లిగా మాయని మచ్చను తెచ్చుకుంది. పేగుబంధానికి విలువ లేకుండా చేసింది. గురువారం రాత్రి ఒడిలో నిద్రిస్తున్న తన కుమారుడిని ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారని అబద్ధాలు చెప్పి భర్తను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమదైన రీతిలో విచారించడంతో ఆమె అసలు నిజం ఒప్పుకుంది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని అప్పనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పసికందు మృతదేహాన్ని బావి నుంచి గురువారం వెలికి తీశారు.
దుబ్బాక సీఐ పాలెపు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రామగళ్ల శ్రీమాన్ నంగనూరు మండలం నర్మెట్టకు చెందిన కవితను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. పుల్లూరులోనే వారు నివాసం ఉంటున్నారు. శ్రీమాన్ ఇటీవల రెండు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి రావడంతో గ్రామంలో పరువు పోయిందని భార్య భావించింది.
అతని అమ్మమ్మ ఊరైన అప్పనపల్లిలో గత రెండు నెలల నుంచి వారు ఉంటున్నారు. ఎంతో ఆనందంగా ఉంటుందనుకున్న జీవితం ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో వారికి కుమారుడు జన్మించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు, భర్త ప్రవర్తన, వ్యవహార శైలి నచ్చని కవిత భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో పసికందు అడ్డుగా ఉన్నాడు. చిన్నారిని తప్పిస్తే భర్తను విడిచిపెట్టి హాయిగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందు దీక్షిత్ కుమార్ను తీసుకెళ్లి గ్రామశివారులో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన దగ్గర నుంచి ఇద్దరు ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు బాబును ఎత్తుకెళ్లిపోయారని భర్తకు చెప్పింది. అందరినీ తప్పుదోవ పట్టిస్తూ కిడ్నాప్ జరిగినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కవిత చెబుతున్న విషయాలకు, జరిగిన ఘటనకు పొంతన లేకపోవడంతో ఆమెను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. భర్త నుంచి విడిపోయి దూరంగా వెళ్లిపోవాలని అడ్డుగా ఉన్న కుమారుడిని తానే బావిలో వేసి చంపినట్లు అంగీకరించింది. దీంతో ఆమె భర్త శ్రీమాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసును హత్య కేసుగా పోలీసులు మార్చారు. అనంతరం కవితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
COMMENTS