EPASS MACHINES UPGRADATION
సన్నబియ్యం పంపిణీ మోసాలకు చెక్ - ఆ యంత్రం మార్పుపై ప్రభుత్వం ఫోకస్.
ప్రజా పంపిణీ పారదర్శకంగా ఉండేందుకు ప్రభుత్వం సంస్కరణలు- ఈపాస్ యంత్రాల ఉన్నతీకరణకు చర్యలు - అవకతవకలకు అవకాశం లేకుండా చర్యలు.
EPass Machines Upgradation Used for Rice Distribution : ప్రజా పంపిణీ పారదర్శకంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలురకాల సంస్కరణలు తీసుకొచ్చింది. ఈసారి ఏకంగా బియ్యం పంపిణీ చేసేందుకు ఉపయోగించే ఈపాస్ యంత్రాల ఉన్నతీకరణకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి జూన్లో పంపిణీ చేయాలని నిర్ణయించడంతో దానికి సంబంధించిన కార్యాచరణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
బియ్యం పంపిణీలో అవకతవకలు జరగకుండా ఈపాస్ యంత్రాల్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసే ప్రక్రియ చేపట్టారు. గోదాం నుంచి రేషన్ దుకాణం, వినియోగదారుడి వరకు ఎక్కడా తేడా రాకుండా యంత్రాలను ఉన్నతీకరిస్తున్నారు. దీనికి పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోనూ, స్టేజి-2 గోదాంలోనూ ప్రత్యేకంగా అధికారిని కేటాయించారు. ఈ నెలాఖరుకల్లా మూడు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని సమకూర్చేందుకు అధికారులు నేరుగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి పర్యవేక్షిస్తున్నారు.
తూకాల్లో మోసాలకు చోటు లేకుండా :
ప్రభుత్వం ఈపాస్ యంత్రాల్లో (రేషన్ పంపిణీ చేసే) తాజాగా ప్రవేశపెట్టిన 3.2 వర్షన్ సాఫ్ట్వేర్తో పలురకాల ప్రయోజనాలున్నాయి. అధికారుల జవాబుదారీతనం మరింత పెరిగేలా పొందుపరిచారు. బియ్యం గోదాం నుంచి రేషన్ దుకాణం చేరే వరకు అధికారులదే బాధ్యత. గతంలో గోదాం నుంచి లారీ బయలుదేరిన తర్వాత అధికారుల బాధ్యత కాకపోవడంతో పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం రేషన్ దుకాణానికి సరకు చేరాక డీలర్ యంత్రంలో వేలిముద్ర పెట్టి క్వింటాళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికితోడు తూకాల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా తయారు చేశారు. గతంలో చాలా మంది తూకాల్లో మోసాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. వినియోగదారుడికి ప్రయోజనం చేకూర్చేలా రూపొందించారు.
అప్డేట్ చేసే బియ్యం పంపిణీ :
ఈపాస్ యంత్రాలను ప్రతి డీలర్ అప్డేట్ చేసుకోవాల్సిందే. తెలియకపోతే అధికారులను అడిగి చేయించుకోవాలి. అప్డేట్ చేసుకొన్న యంత్రాల ద్వారనే నిబంధనల ప్రకారం బియ్యం పంపిణీ చేయాలి. అలా చేస్తే ఎంతమంది లబ్ధిదారులు బియ్యాన్ని తీసుకుంటున్నారు. పూర్తి లెక్కలు తెలియడంతో పాటు మోసాలకు అవకాశం లేకుండా పోతుంది.
COMMENTS