TMREIS ADMISSION 2025
మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ - ఆ రెండు తరగతుల వారు మాత్రమే అర్హులు.
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా క్లాసులు - భోజనం వసతితో పాటు ఎసెంట్కూ కోచింగ్! - గురుకుల జూనియర్ కళాశాలల్లోనూ దరఖాస్తులకు ఆహ్వానం!
Gurukul Admissions 2025 : 2025-26 విద్యాసంవత్సరానికి గానూ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో మైనార్టీయేతరాలకు ప్రవేశాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మైనార్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.
ఈ క్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు వికారాబాద్లోనూ మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్మీడియట్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియను చేపట్టారు. 5వ తరగతికి సంబంధించి ఒక్కో పాఠశాలలో 80 సీట్లు చొప్పున ఉన్నాయి. ఇందులో మైనార్టీయేతరాలకు సంబంధించి 20 సీట్లను లక్కీడిప్ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. మిగిలిన 60 సీట్లను మైనార్టీలకు కేటాయించారు. ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్, జైనులకు సంబంధించి 4వ తరగతి చదివిన విద్యార్థులు ఈ పాఠశాలలో చేరడానికి అర్హులు.
ఒక్కో కళాశాలలో రెండు గ్రూపులు అమలు చేస్తున్నారు. ఇందులో 80 సీట్లు ఉన్నాయి. 20 మైనార్టీయేతరాలకు కేటాయించారు. మైనార్టీ గురుకులాల్లో 10వ తరగతి చదివిన వారితో భర్తీ చేశారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా కాలేజీలో సీట్లను కేటాయిస్తారు. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తయింది.
మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు వసతి సౌకర్యం, భోజనం :
ఉదయం(ప్రతిరోజూ) : రాగిజావ, పాలు ఏదో ఒకటి
ఉదయం 8 గంటలకు : టిఫిన్
సాయంత్రం : పాలు, బిస్కెట్లు(అల్పాహారంగా అందిస్తారు)
రాత్రి : భోజనంలో గుడ్డు
ప్రతి ఆదివారం : నాన్ వెజ్
వారికి ప్రత్యేక బోధన :
పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా బోధిస్తారు. స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించేందుకు ఆగస్టు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఇంటర్ చదివే వారికి నీట్, ఎసెంట్ కోచింగ్ సైతం ఇస్తారు. క్రీడల్లో రాణించేందుకు ప్రతి రోజు సాయంత్రం ఆటలు ఆడిస్తారు.
పాఠశాలల్లోనే సమర్పించాలి :
మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆయా పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలని ప్రాంతీయ సమన్వయకర్త బహుమతి తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం అని అన్నారు. నాన్ మైనార్టీలకు సంబంధించి సీట్లు భర్తీ అయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు.
COMMENTS