CONTROVERSY OVER ENVIRONMENTAL FEE
వడ్ల లారీలకు పర్యావరణం ఫీజులు - ఒక్కో లారీకి రూ.525 వసూలు.
చెక్పోస్టుల్లో ఒక్కో లారీకి రూ.525 వసూలు - సమస్య సీఎం రేవంత్రెడ్డి దృష్టికి - ఫీజు తగ్గింపుపై అటవీ శాఖ కసరత్తు.
Controversy over Environmental Fee : ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెక్పోస్టుల్లో వడ్ల( ధాన్యం) లారీలకు పర్యావరణ నిర్వహణ రుసుంను వసూలు చేస్తుండటం వివాదాస్పదంగా మారుతోంది. ఈ విషయం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లింది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశాల్లోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ పరిణామాల దృష్ట్యా రుసుం తగ్గింపుపై అటవీ శాఖ ఉన్నతాధికారులు కసరత్తును ప్రారంభించారు.
రైతులపై భారం :
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వడ్లను కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం రైస్మిల్లులకు తరలిస్తారు. ఆ ధాన్యం బస్తాల లారీలు పలు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లోని రోడ్ల మీదుగా వెళుతుంటాయి. కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధుల్లోని జిల్లాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్యావరణ రుసుంను వసూలు చేస్తోంది. కాగా ప్రభుత్వ వాహనాలకు మినహాయింపు ఉంది. ధాన్యం బస్తాలు తీసుకెళ్లే ఒక్కో లారీకి రూ.525 ఫీజును వసూలు చేస్తున్నారు.
250 లారీల నుంచి రూ. రూ.1,31,250 :
మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం తపాల్పూర్ (కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధి)లోని అటవీ చెక్పోస్టులోనే దాదాపు 250 లారీల నుంచి రూ.1,31,250 రుసుము వసూలు చేశారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఈ భారాన్ని అన్నదాతలపై వేస్తున్నారు. దీంతో ధాన్యం లారీలకు పర్యావరణ రుసుం మినహాయింపు ఇవ్వాలంటూ జిల్లా ఫారెస్ట్ అధికారి నాగిని భానుకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లేఖ రాశారు. అటవీ శాఖ వర్గాలు మాత్రం ధాన్యం వెళ్లేది ప్రైవేటు వాహనాల్లో అని, రూల్స్ ప్రకారమే ఫీజును వసూలు చేస్తున్నట్లుగా చెబుతున్నాయి. ఈ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లడంతో ధాన్యం లారీలకు పర్యావరణ రుసుం తగ్గింపుపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫీజులో పూర్తిగా మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
COMMENTS