Paddy : వరి నారుమడుల్లో చీడపీడలు, నివారణ
Paddy : తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది వరి సాగు విస్తీర్ణం అధికంగానే ఉంటుంది. వరిలో మంచి నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే రైతులు నారుదశ నుండే అన్ని రకాల జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ప్రధానంగా వరిలో నారును చిడపీడలు ఆశించకుండా జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉంది. రైతులు తమ ప్రాంతాలకు అనుకూలంగా ఉండే అనువైన వంగడాలను ఎంపిక చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన పొలం నుండి వవత్తినాలను సేకరించాలి. సేకరించిన విత్తనాలను శుద్ధి చేసుకోవాలి.
విత్తనాల శుద్ధికోసం లీటరు నీటిలో ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి ఆ మందు ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటలపాటు నానబెట్టాలి. ఆతరువాత మండె కట్టాలి. నారుమడిని ప్రతిరోజు గమనిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తొలకరిలో కురిసిన వర్షాలకు పొలం గట్లపైన, పొలంలో గడ్డి పెరుగుతుంది. నారు పోయకముందే హిస్పా పురుగులు ఈ గడ్డిని ఆశ్రయిస్తాయి. తరువాత నారుపై దాడి చేస్తాయి. హిస్పా అనేది నీలం , నలుపు రంగులతో కూడిని పెంకు పురుగు. దీని శరీరంపై ముళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. తల్లి పెంకు పురుగు కూడా నారుమడికి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగులు ఆశించటం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు, తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి.
వరి నారుకు కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. దీని రెక్కల పురుగులు పసుపు రంగులో ఉంటాయి. రెక్కల ముందు రెక్కల మధ్యలో నల్లని మచ్చలు కన్పిస్తాయి. ఒక్కో పురుగు ఆకుల చివరి భాగంలో 20 నుండి 70 గుడ్లను పెట్టి, వాటి వెంట్రుకలతో కప్పుతాయి. గుడ్ల నుండి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వచ్చి, మూడు రోజుల్లో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తాయి. దీని వల్ల మొవ్వు ఆకు ఎండి చనిపోతుంది.
ఈ మధ్యకాలంలో ఉల్లికోడు పురుగు వ్యాప్తి అధికమైంది. సాధారణంగా ఉల్లికోడు పురుగులు పిలక దశ తరువాతే పంటపై తీవ్ర స్ధాయిలో దాడి చేస్తాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా నారుమడి దశలోనే ఈ పురుగు తాకిడి అధికమైంది. ఉల్లికోడు పురుగులు ముదురు ఎరుపు రంగులో దోమల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆకులపై విడిగా , 2నుండి 3 గుడ్లు పెడతాయి. వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. అవి అంకురం వద్దకు చేరి ఒక విధమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీని వల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టంగా మారి, ఉల్లికోడు మాదిరిగా బయటికి వస్తుంది.
నారుమడి పోసిన తరువాత వర్షాభావ పరిస్ధితులు ఎదురైతే మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంటుంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి. ఒక వేళ నారుమడి పోసిన తరువాత వర్షాలు బాగా కురిసి మొక్కలు ముంపుకు గురైతే వాటిని నారును కత్తించే లద్దె పురుగులు ఆశిస్తాయి. ఇవి రాత్రి సమయంలో నారుమడిని ఆశించి మొక్కల్ని కొరికేస్తాయి. పగటి వేళ కలుపు మొక్కలపైన భూమిలోనూ ఉంటాయి. ఇందుకు గాను నారు పోసిన ఏడవ రోజు నుండే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి 1.6 మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 2మి.లీ క్లోరిపైరిఫాస్, ప్రొఫెనోఫాన్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే నారు తీయటానికి వారం రోజుల ముందు 160 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి లేదా 50 గ్రాముల ఫోరేట్ 10జి గుళికల్ని ఇసుకలో కలిపి సెంటు నారుమడిలో చల్లుకోవాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు పలచగా ఉండాలి. నారుమడిని లద్దె పురుగు ఆశిస్తే పైన తెలిపిన మందుల్ని సాయంత్రం వేళ పిచికారి చేసుకోవాలి.
COMMENTS