Okra Cultivation : సేంద్రియ బెండ సాగులో సస్యరక్షణ
Okra Cultivation : కూరగాయల సాగు ప్రస్తుతం రైతుకు లాభసాటిగా మారటంతో ఎక్కవ మందిరైతులు ఆవైపు దృష్టిసారిస్తున్నారు. విచక్షణా రహితంగా పురుగు మందుల వాడకం పెరగటంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్న నేపధ్యంలో కొనుగోలు దారులు సేంద్రీయ పద్దతుల్లో పండించిన కూరగాయలను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. దీంతో సేంద్రీయ కూరగాయలకు మార్కెట్లో మంచి గిరాకీ లభిస్తుంది. సేంద్రీయ పద్దతిలో ఈ మధ్య రైతులు బెండసాగు చేపడుతున్నారు. అయితే సేంద్రీయ విధానంలో బెండ సాగు చేసే రైతులు సస్యరక్షణ విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే మంచి దిగుబడితోపాటు, నాణ్యతను పొందవచ్చు.
సేంద్రీయ బెండలో సస్యరక్షణ ;
కాండం, కాయ తొలిచే పురుగు: పురుగు తొలి దశలో నీమాస్త్రం లేదా 5శాతం వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. తరువాత దశలో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ద్రావణం, నేలబెండ కషాయం పిచికారీ చేయాలి.
దీపపు పురుగులు ; పసుపు రంగు జిగురు పూసిన డబ్బాలను పంట నాటిన 30 రోజుల సమయంలో ఎకరానికి 12 చొప్పున అమర్చుకోవాలి. 5శాతం వేపగింజల ద్రావణం లేదా, కానుగ గింజల కషాయం , లేదా పచ్చిమిర్చి, వెల్లుల్లి అల్లం ద్రావణం లేదా పొగాకు కషాయం పిచికారి చేయాలి.
కాయతొలిచే పురుగులు ; ఎకరానికి 6 నుండి 8 పక్షిస్ధావరాలు ఏర్పాటు చేయాలి. ఒక కిలో మెంతుల పిండిని 2లీ నీటిలో కలిపి 24 గంటలు అలాగే వదిలేయాలి. తరువాత 40 లీ. నీటిని కలిపి పిచికారి చేయాలి. 4కిలోల కలబంద 500 మి.లీ. పొగాకు పొడి 20 లీటర్ల నీటిలో కలిపి 3 గంటలు 4వ వంతు మాత్రమే మిగిలే వరకు మరగబెట్టాలి. తరువాత చల్లార నివ్వాలి. 50 గ్్రా కుంకుడు కాయల పొడిని కలపాలి. 100 నుండి 150 మి.లీ కషాయాన్ని 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
400 గ్రా ఇంగువ పొడిని 1 లీటరు నీటితో కలిపి 24 గంటల పాటు ఉంచాలి. తరువాత 16 లీటర్ల నీటిని ఈ మిశ్రమానికి కలిపి ఎకరా విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేస్తే 7రోజుల్లో 50 శాతం లార్వాలు నివారించబడతాయి. ఎకరానికి 4లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. 5శాతం వేపగింజల ద్రావణం లేదా నేలవేము కషాయం లేదా వాచపత్ర కషాయం పిచికారి చేసి తొలిదశలోని లార్వాలను నివారించవచ్చు. దశపత్ర కషాయం, సీతాఫలం కాయల కషాయం, విషముష్టి ఆకులు లేదా కాయ కషాయం , తుమ్మికూర , తాటాకు కషాయం బాగా పనిచేస్తాయి. వీటిలో అందుబాటులో ఉండే ఏ రెండింటినైనా పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. ఎకరానికి 20,000ట్రైకోగ్రామా గుడ్లను వారం వ్యవధిలో 6సార్లు విడుదల చేయాలి.
తెల్లదోమ ;పంట విత్తిన 30 రోజుల సమయంలో ఎకరానికి 8 నుండి 10 జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను పొలంలో అమర్చాలి. వేప కషాయం లేదా పొగాకు కషాయం పిచికారి చేయాలి. ఎర్రనల్లి ఉదృతి ఉన్న సందర్భంలో పొగాకు కషాయం పిచికారి చేయటం వల్ల ఫలితం ఉంటుంది.
సాధారణ తెగుళ్ళ యాజమాన్య పద్దతులు ; సాధారణ తెగుళ్ళు వచ్చిన సందర్భంలో 250 గ్రా మెంతాకు పొడిని 2లీటర్ల నీటిలో కలిపిన ద్రావణం పిచికారి చేయాలి. 10శాతం ఆవు మూత్రం 3సార్లు 10 రోజుల వ్యవధిలో కలిపి పిచికారి చేయాలి. 5శాతం వేపగింజల కషాయం పిచికారి చేయాలి. వాతడం లేదా వస రెండు సార్లు సాయంత్రం వేళల్లో వేయాలి.
COMMENTS