TRANSPORT DEPT FOCUS ON ROAD SAFETY
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఈజీగా దొరికేస్తారు! - ఈ - ఎన్ఫోర్స్మెంట్ పరికరాలు వస్తున్నాయ్.
ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణపై రవాణాశాఖ దృష్టి - ‘రియల్ టైం’లో నమోదుకు 375 ట్యాబ్లు కొనుగోలు చేయనున్న ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్.
Transport Dept Focus on Road Safety : రహదారులపై నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల కట్టడికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రాష్ట్ర రవాణాశాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది ఏఎంవీఐ(అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల)లతో రాష్ట్రస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. వీరందరినీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని రవాణాశాఖ నిర్ణయించింది. అదేసమయంలో వాహన తనిఖీల్లో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్(ఈ-ఎన్ఫోర్స్మెంట్) పరికరాల వాడకానికి ప్రణాళికలను రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. ఇందుకోసం మొత్తంగా రూ.8.4 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదించింది.
‘రియల్ టైం’లో నమోదుకు 375 ట్యాబ్లు :
రాష్ట్రంలో జరుగుతున్న అధికశాతం రోడ్డు ప్రమాదాలకు అతివేగంగా డ్రైవ్ చేయడమనేది ఓ ప్రధాన కారణం. వేగపరిమితుల్ని(స్పీడ్ లిమిట్) నిర్దేశించినప్పటికీ చాలామంది వాహనచోదకులు వాటిని పాటించట్లేదు. గత ఏడాది ఏకంగా 11.31 లక్షల అధిక వేగం(ఓవర్ స్పీడ్) కేసులు నమోదయ్యాయి. 25,971 మంది అన్నిరకాల రోడ్డు ప్రమాదాల్లో బాధితులు అయ్యారు. అధికవేగంతో వెళ్లే వారిపై కేసుల నమోదు చేసేందుకు రవాణాశాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 40 స్పీడ్ గన్లను కొనుగోలు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది.
రియల్ టైంలో ట్యాబ్లో నమోదు :
ఇందుకోసం ఒక్కోదానికి రూ.7 లక్షల చొప్పున రూ.2.8 కోట్లు అవసరం అవుతాయి. ట్రాన్స్ఫోర్ట్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వాహనాలను తనిఖీ చేసినప్పుడు వెహికిల్ చెక్ రిపోర్ట్(వీసీఆర్)ను మాన్యువల్గానే ఎంటర్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ వివరాల నమోదులో జాప్యం కారణంగా ఎక్కువ వాహనాలను చెక్ చేయలేకపోతున్నారు. దీంతో ట్యాబ్(హ్యాండ్హెల్డ్ డివైజ్)లు కొనుగోలు చేసేందుకు రవాణాశాఖ సిద్ధం అవుతోంది. వీటితో వాహనచోదకుల ట్రాఫిక్ ఉల్లంఘనలను రియల్ టైంలో ట్యాబ్లో ఎంటర్ చేయవచ్చు. వాహనదారులు జరిమానాల్ని, పాత బకాయిల్ని వెంటనే చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఒక్కో ట్యాబ్ ధర 1.5 లక్షలు. 375 ట్యాబ్ల కొనుగోలుకు రూ.5.6 కోట్ల ఖర్చు కానుంది. కొత్తగా నియామకమైన 113 మంది ఏఎంవీఐలను క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని రవాణాశాఖ నిర్ణయించింది.
COMMENTS