SARASWATI PUSHKARALU AT KALESHWARAM
నేటి నుంచే సరస్వతి పుష్కరాలు - మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.
ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు - వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం - ప్రత్యేకంగా బస్సులు నడపనున్న టీజీఎస్ఆర్టీసీ.
SARASWATI PUSHKARALU AT KALESHWARAM : గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానమైన కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. కాళేశ్వర త్రివేణి సంగమ ప్రాంతంలో రేపటి నుంచి భక్తుల సందడి మొదలు కానుంది. పుష్కరాలకు భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నదిలో సరిపడా నీటి ప్రవాహం ఉండటంతో పుణ్యస్నానాలకు ఇబ్బంది లేదు. భక్తులు సేదతీరేందుకు చలువ పందిళ్లు కూడా సిద్ధం చేశారు.
రేపు ప్రారంభమవనున్న సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ను ఆయన ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో సీఎం పుణ్యస్నానం ఆచరిస్తారు.
మహా పుష్కరాలకు దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మే 15న ఉదయం 5 గంటల 44 నిమిషాలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానాలు ఆరంభిస్తారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా మహాలక్ష్మి బస్సులు : సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసీ కూడా సన్నద్ధమైంది. ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న ఈ పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులు నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.
తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి కాళేశ్వరంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడానికి ఆర్టీసీ యాజమాన్యం అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
కరీంనగర్ జోన్లోని వివిధ డిపోల నుంచి బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కరీంనగర్ రీజియన్ నుంచి కాళేశ్వరానికి ఈ నెల 15 నుంచి 26 వరకు రోజూ 50 అదనపు సర్వీసులు నడపనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులను కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు.
సరస్వతి నది పుష్కరాల నేపథ్యంలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు అధికారులతో సమావేశం నిర్వహించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
"కరీంనగర్, మంథని, గోదావరిఖని డిపోల నుంచి ప్రత్యేకంగా అదనపు బస్సులు నడుపుతున్నాం. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. రద్దీకి అనుగుణంగా తగు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం" -బి.రాజు, కరీంనగర్ ప్రాంత రీజినల్ మేనేజర్.
COMMENTS