NCERT Survey: విద్యార్థుల్లో ఆందోళనకు పరీక్షలు, ఫలితాలే కారణం! ఎన్సీఈఆర్టీ సర్వేలో వెల్లడి!
NCERT Survey : పరీక్షలు అంటేనే విద్యార్థులో ఓ రకమైన భయం. ఎలా చదవాలి..? ఏం చదవాలి? పరీక్షలు తప్పితే తల్లిదండ్రులు ఏమంటారోనని ఆందోళనకు గురవుతూ ఉంటారు. అలాగే పరీక్షల ఫలితాల సమయంలో పరిస్థితి మరీ చెప్పనక్కర్లేదు.
అయితే, దేశవ్యాప్తంగా 33శాతం మంది విద్యార్థులు పరీక్షలు, ఫలితాలతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) అన్ని రాష్ట్రాల్లోని 3.79 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంపై సర్వే చేపట్టింది. ఇందులో 73శాతం మంది పాఠశాల జీవితంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
మరో 45శాతం మంది విద్యార్థులు తమ రూపంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. అలాగే పిల్లలు మాధ్యమిక తరగతికి మారిన సమయంలో పాఠశాల జీవితంపై పాఠశాల జీవితంపై సంతృప్తి తగ్గుతున్నట్లు గుర్తించారు. సెకండరీ స్థాయిలో గుర్తింపు, సంబంధాలపట్ల సున్నితత్వం పెరగడం, తోటివారి ఒత్తిడి, బోర్డు పరీక్షల అంటే భయం, భవిష్యత్లో అడ్మిషన్ల గురించి ఆందోళన చెందుతున్నట్లు సర్వేలో తేలింది.
73శాతం మంది పాఠశాల జీవితంపై సంతృప్తి వ్యక్తంచేయగా.. మరో 28 శాతం మంది ప్రశ్నలు అడగడంలో తడబడుతున్నారు. ఎన్సీఈఆర్టీకి చెందిన మనోదర్పన్ ఈ సర్వేను నిర్వహించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య 6 నుంచి 8, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులపై సర్వే జరిపారు.
51శాతం మంది విద్యార్థులు ఆన్లైన్లో చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. 81శాతం మంది పిల్లలు తమ ఆందోళనకు చదువులు, పరీక్షలు, ఫలితాలు ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. చిన్నారుల మానసిక ఆరోగ్యం, శేయస్సుకు సంబంధించిన అంశాలపై వారి అవగాహనలను అర్థం చేసుకోవడంలో సహకరించేందుకు సర్వే నిర్వహించినట్లు ఎన్సీఈఆర్టీ వర్గాలు తెలిపాయి. అయితే, ఒత్తిడిని ఎదుర్కొనేందుకు యోగా, ధ్యానం, విద్యార్థుల ఆలోచనలు మార్చడం, ఒత్తిడిని తగ్గించేందుకు ఉపకరిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
COMMENTS