Andhra Pradesh: అదో సమాధుల గ్రామం.. ఊరి నిండా గోరీలే.. విచిత్ర గ్రామం వివరాలు మీకోసం..
Andhra Pradesh: ఆ ఊరి నిండా గోరీలే. ప్రతి ఇంటి ముందు కనీసం ఒక సమాధి ఉంటుంది. ఆడవాళ్లు వాటి మధ్యే నీళ్లు మోసుకుంటూ వెళ్తారు. పిల్లలు అక్కడే ఆడుకుంటారు. బడి, గుడి అన్న తేడా లేదు. ఊరి మధ్యలో సమాధులు ఉన్నాయా.. సమాధుల మధ్య ఊరుందో అర్థం కానీ పరిస్థితి. అక్కడి వారికి అవే సర్వస్వం. పైగా, అక్కడివరెవరూ.. పట్టె మంచాల మీద పడుకోరట. పడుకుంటే కీడు జరుగుతుందట.
ఇంతకీ ఎక్కడ ఉందా సమాధుల గ్రామం ? ఏంటా కథ? ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సమాధుల గ్రామం.. కర్నూలు నుంచి పడమర వైపున 66 కిలోమీటర్ల దూరంలోని గోనెగండ్ల మండలంలోని గంజిహల్లి పంచాయితీ పరిధిలో ఉంది. ఈ గ్రామం పేరు అయ్యకొండ. పేరుకు తగ్గట్టుగానే కొండమీద ఉంది ఈ గ్రామం. ఇక్కడ సుమారుగా వంద ఇండ్లు, మూడు వందల దాకా జనాభా ఉంటుంది. ఇక్కడ ఏ ఇంటి ముందు చూసిన సమాధులే దర్శనమిస్తుంటాయి. సమాధుల ముందు నిత్య నైవేద్యాలు పెడతారు. ఏం వండినా ముందు నైవేద్యం పెట్టిన తర్వాతే ఇంట్లోని వాళ్లు తినాలి. లేదంటే కీడు జరుగుతుందని వీళ్ల నమ్మకం. ఇక వీరు తమకు అవసరమైన నిత్యవసరాలు, రేషన్ సరుకుల కోసం, పింఛన్ల కోసం, సంతకు కొండకింద ఉన్న గంజిహల్లికి వెళ్లాల్సిందే.
ఈ గ్రామంలో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. ఇక్కడి వారు ఈ ఊరిలోని వారినే పెళ్లి చేసుకోవాలి. ఈ గ్రామస్థులతోనే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి. బయటి సంబంధాలు చేసుకోరు. ఇక్కడ అందరూ కష్టపడి పని చేస్తారు. వీరిలో 80శాతం మందికి కొండకింద భూములున్నాయి. కొర్రలు, సజ్జలు, పల్లీ, మిరప, ఉల్లి వంటి పంటలు పండిస్తారు. తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్లి, సూర్యుడు అస్తమించకముందే గ్రామానికి చేరుకోవడం వీరి ఆనవాయితీ. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. కట్టు తప్పితే కీడు జరుగుతుందని ఇక్కడివారి నమ్మకం. ఏదీ ఏమైనా, అయ్యకొండ గ్రామస్తుల విచిత్ర ఆచారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్టాపిక్ గా మారుతోంది. ప్రభుత్వాలు స్పందించి ఇక్కడి ప్రజల్లో చైతన్యం కలిగించాలని నెటిజన్లు కోరుతున్నారు.
COMMENTS