VILLAGE BRIDE BECOME A MILLIONAIRE
రూ.30వేల రుణంతో వ్యాపారం స్టార్ట్- ఏటా రూ.4లక్షల ఆదాయం- ఒడిశా లఖ్ పతి దీదీ సక్సెస్ స్టోరీ ఇదే!
లోన్ తీసుకుని పలు వ్యాపారాలను ప్రారంభించిన మహిళ- ఏటా రూ.4 లక్షలకు పైగా ఆదాయం
Village Bride Become A Millionaire : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లఖ్ పతి దీదీ పథకం ద్వారా లోన్ తీసుకుని వ్యాపారంలో రాణిస్తోంది ఒడిశాకు చెందిన ఓ మహిళ. ప్రస్తుతం ఏడాదికి రూ.4లక్షలు సంపాదిస్తోంది. పొలంలో వ్యవసాయం, దుకాణాల్లో సరకులు అమ్మడం, గోధుమలను ఆడే మిల్లు ఇలా రకరకాల పనులు, వ్యాపారాలు చేస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది. ఆమె విజయప్రస్థానం ఏంటో తెలుసుకుందాం.
ఇటీవలే రాష్ట్ర ప్రజా సేవా భవనంలో జరిగిన జాతీయ లఖ్ పతి దీదీ సమావేశంలో కేంద్రపారా జిల్లా ఒడిశాలో రెండో స్థానంలో నిలిచింది. అదే జిల్లాకు చెందిన మమతా నాథ్ శర్మ లఖ్ పతి దీదీగా ఎదిగారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ కృషి వల్లే తానిప్పుడు లఖ్ పతి దీదీని అయ్యాయని మమత ఆనందం వ్యక్తం చేశారు.
'నాతో పాటు మరో నలుగురికి ఉపాధి'
"నేను 2011 నుంచి స్వయం సహాయక గ్రూప్లో ఉన్నాను. స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సొంత సంస్థను ప్రారంభించాను. అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూడలేదు. నూనె, చిక్కుడు గింజల పొట్టు తీసే యంత్రాలు, బియ్యం పొట్టు యంత్రాలు, సుగంధ ద్రవ్యాలను నూరే మెషిన్లు కొన్నాను. వాటితో నేను స్వయం ఉపాధి పొందాను. అలాగే మరో నలుగురికి ఉద్యోగాలు ఇవ్వగలిగాను" అని మమత శర్మ తెలిపారు.
తొలి ప్రయత్నంలోనే సక్సెస్
పట్టముంరాయి బ్లాక్లోని తార్డిపాల్ గ్రామానికి చెందిన మహిళ మమతా నాథ్ శర్మ. ఒకప్పుడు ఆమె కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండేది. ఆ తర్వాత కొంత ఆర్థికంగా చితికిపోయింది. దీంతో 2011 లో ఆమె స్వయం సహాయక బృందంలో చేరింది. తర్వాత ఆ గ్రూప్ నుంచి రూ.30,000 అప్పుగా తీసుకుంది. మొదట గోధుమ నూర్పిడి యంత్రాన్ని కొనుగోలు చేసింది. సమీప గ్రామాల ప్రజలు గోధుమలు కోయడానికి ఆమెను సంప్రదించడంతో మంచి ఆదాయం వచ్చేది. దీంతో సకాలంలో అప్పును తీర్చేసింది.
ఆ తర్వాత మమత వివిధ గ్రూపులు, బ్యాంకుల నుంచి రుణం తీసుకుంది. రూ.5 లక్షలతో వెరైటీ స్టోర్ను ఓపెన్ చేసింది. అలాగే 2 ఎకరాల స్థలంలో బియ్యం హల్లర్, ఆయిల్ ప్రెస్ మెషిన్, పల్స్, బెర్రీ పీలింగ్ మెషిన్, మసాలా గ్రైండింగ్ మెషిన్, అల్లం, వెల్లుల్లి మసాలా గ్రైండింగ్ మెషిన్, బియ్యం గ్రైండింగ్ మెషిన్, గోధుమ నూర్పిడి యంత్రం వంటి యూనిట్లను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందింది. అలాగే ఆమెతోపాటు స్వయం సహాయక సంఘంలోని ఇతర సభ్యులు ఉపాధి పొందుతున్నారు. గోధుమ పిండి, పసుపు, వివిధ సుగంధ ద్రవ్యాలను తయారు చేసి మార్కెట్లో అమ్మడం ద్వారా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
మమత నెలకు రూ.30,000- రూ.40,000 వరకు సంపాదిస్తున్నారు. ఏటా రూ.4 లక్షలకు పైగా రాబడి వస్తోంది. కుటుంబ ఖర్చులుపోనూ మిగతా డబ్బును పిల్లల చదువుకు ఉపయోగిస్తోంది. మమత భర్త ఆమెకు అన్ని పనుల్లో అండగా నిలుస్తున్నాడు. సొంత వ్యవసాయ భూమిలో వరి, బీన్స్, మూంగ్ మొదలైన వివిధ పంటలను మమత పండిస్తున్నారు. వాటితో పాటు కొత్తిమీర, మెంతులు, దోసకాయ, గుమ్మడికాయ వంటి కాలానుగుణ పంటలను పండిస్తూ మంచి రాబడిని పొందుతోంది.
"మమత ఒక గృహిణి. కానీ ఇప్పుడు ఆమె ఆదాయంతో కుటుంబం గడుస్తోంది. ఆమె ఒంటరిగా ఇన్ని యూనిట్లను నడపడం సాధ్యం కాదు. అందుకే నేను ఆమెకు మద్దతు ఇస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆమె చాలా కష్టపడి పనిచేస్తుంది. ఇంటి వెలుపల తన బాధ్యతలను బాగా నిర్వర్తిస్తోంది. గతంలో మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కానీ ఇప్పుడు మేము హాయిగా ఉన్నాం" అని మమత భర్త తెలిపారు.
రెండో స్థానంలో కేంద్రపారా జిల్లా
98శాతం లఖ్ పతి దీదీలను సృష్టించడం ద్వారా నయాగఢ్ జిల్లా ఒడిశాలో మొదటి స్థానంలో ఉంది. 97 శాతం లఖ్ పతి దీదీలతో కేంద్రపారా జిల్లా రెండో స్థానం పొందింది. ఈ అవార్డును లోక్ సేవా భవన్లో జిల్లా కౌన్సిల్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందుకున్నారు. కేంద్రపారా జిల్లా నుంచి ముగ్గురు లఖ్ పతి దీదీలు ఈ జాతీయ స్థాయి సమావేశానికి హాజరయ్యారు.
లఖ్ పతి దీదీ యోజన అంటే ఏమిటి?
2023 డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం లఖ్ పతి దీదీ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు జీవనోపాధి మిషన్ ద్వారా ఏటా లక్ష రూపాయలు సంపాదిస్తే వారిని లఖ్ పతి దీదీలుగా పిలుస్తారు. ఈ లఖ్ పతీ దీదీలు ఆర్థిక స్వావలంబన పొంది, ఇతరులకు ఉపాధిని కల్పిస్తారు.
COMMENTS