TG ARCHIVES AND RESEARCH INSTITUTE
వందల ఏళ్ల నాటి ఏ భూదస్త్రం కావాలన్నా అక్కడ దొరుకుతుంది - కానీ ఇంటి దొంగలే పడ్డారు!
ఆర్కైవ్లో దొంగలు పడ్డారు - రూ.వేల కోట్ల భూముల దోచుకోవడానికి భారీ కుట్ర - స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్-తెలంగాణా రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో వింత పరిస్థితులు
Telangana State Archives and Research Institute : బహుమని సుల్తానులు మొదలు విజయనగర సామ్రాజ్యం దాకా, అసఫ్ జాహీల నుంచి మొగలుల వరకూ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 43 మిలియన్లకు పైగా విలువైన చారిత్రక దస్త్రాలకు నిలయమది. బహుమని సుల్తాన్ ఫెరోజ్ కాలంనాటి ఫర్మానాలు మొదలుకొని నిజాం కాలంనాటి దఫ్తర్ రికార్డులు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. ముఖ్యంగా 1282 సంవత్సరం నుంచి మొదలుకొని 1956 సంవత్సరం వరకు 2,15,090 ఫైళ్లతో కూడిన సుబేదారి, పాయెగా భూ రికార్డులున్నాయి. నిజాం కాలంనాటి వేలకోట్ల విలువైన భూముల దస్త్రాలు అక్కడే నిక్షిప్తం కావడంతో కొన్ని దొంగల ముఠాల కళ్లు హైదరాబాద్ తార్నాకాలో ఉన్న ఈ కార్యాలయంపై పడ్డాయి. ముఖ్యంగా రాజధాని శివార్లలోని భూములను కాజేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇంటిదొంగలు ఇందుకు సహకరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అసలు రాజ్యాభిలేఖ పరిశోధనాలయంలో ఏం జరుగుతోంది? అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారినా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ అంశాలపై విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండున్నర దశాబ్దాల క్రితం భూములకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. రాళ్లురప్పలతో సాగుకు అనుగుణంగా లేకపోవడంతో పడావుగా మిగిలిపోయేవి. హైటెక్ సిటి ఏర్పాటైన తర్వాత స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంది. భూముల విలువ అమాంతం పెరిగింది. ఈక్రమంలో ఏళ్లుగా ఎవరూ పట్టించుకోని భూములపై కన్నేసే ముఠాలు తయారయ్యాయి. తొలుత అలాంటి భూములను గుర్తించి పూర్వకాలంలో నిజాం ఓ వ్యక్తికి ఇనామ్గా ఇచ్చారంటూ ముంతకాబ్ లేదా ఫర్మానాలను సృష్టిస్తారు. ఆ వ్యక్తి పేరిట ఓ కుటుంబవృక్షాన్ని తయారు చేస్తారు. ఆ కుటుంబానికి వారుసులుగా కొందరిని తెర పైకి తెస్తారు. వారి పేరుతో ఐదారు దశాబ్దాల క్రితం నాటి తేదీతో నకిలీ దస్త్రాన్ని సృష్టిస్తారు.
పాతబస్తీ కేంద్రంగా ముఠా దందా :
పాతబస్తీ కేంద్రంగా ఈ ముఠాల పనిచేస్తున్నాయని పలు సందర్భాల్లో వెల్లడైంది. అలా నకిలీ దస్త్రాలు సృష్టించిన అనంతరం ఆయా ముఠాలు ఆర్కీవ్స్ విభాగంలోని ఇంటిదొంగలను సంప్రదిస్తున్నాయి. తమ వద్ద ఉన్న నకిలీ దస్త్రాలను దొంగచాటుగా ఆర్కైవ్స్ విభాగంలోని రికార్డుల్లోకి చేర్చుతున్నాయి. ఆ పని అయిన వెంటనే సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తున్నాయి. తమకు పాత కాలంనాటి భూమి దస్తావేజులు కావాలని అడుగుతున్నాయి. అప్పటికే అలాంటి ముఠాలతో కుమ్మక్కవుతున్న ఇంటిదొంగలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే దస్త్రంపై ఆర్కైవ్స్ విభాగం నుంచి ఇచ్చినట్లుగా రాజముద్ర వేసి ముఠాల చేతికి ఇస్తున్నారు.
ఆ దస్త్రం నిజమైనదే అని నమ్మించేందుకు ముఠాలు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. అదే దస్త్రం కోసం ఐదారుగురు పేర్లతో దరఖాస్తు చేసి తీసుకుంటున్నారు. అంతమంది వద్ద అదే దస్త్రం ఉండటంతో నిఖార్సైనదే అని నమ్మించే పన్నాగాలకు పాల్పడుతున్నారు. అలా తమ చేతికి వచ్చిన దస్త్రంతో ముఠాలు న్యాయ వ్యాజ్యం దాఖలు చేస్తూ అసలైన పట్టాదారులకు చిక్కులు సృష్టిస్తున్నారు. కోర్టుల్లో వ్యాజ్యాలు ఏళ్ల తరబడి నడుస్తుండటంతో వాటిచుట్టూ తిరిగే ఓపికలేని బాధితులు ముఠాలు అడిగినంత వాటాను భూమిలో ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
"కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ అయ్యాయి. అది ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూమి. అది రాయదుర్గంలో ఉంది. ఆ భూమి కోర్టు లిటిగేషన్లోకి పోవడం, ఆ తర్వాత అది వేరే పరిణామంలో మా దృష్టికి రావడం. ఇంటర్నల్ ఎంక్వైరీలో చంద్రశేఖర్ది పూర్తి బాధ్యత ఉందని తేలడం దీంతో ఆయనను డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. ఇదే విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఈ భూమి లిటిగేషన్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడంతో వారికి వెళ్లిందని చెప్పడంతో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని నమ్మింది." - మహేశ్రెడ్డి, రాజ్యాభిలేఖ పరిశోధనాలయ డిప్యూటీ డైరెక్టర్
విచిత్రమైన రీతిలో నాలుగు దరఖాస్తులు :
సాధారణంగా ఏదైనా భూమికి సంబంధించిన అడంగల్ పహాణీ లేదా సేత్వార్ లేదా ఇతర రికార్డుల కోసం సమాచార హక్కు చట్టం కింద గనక దరఖాస్తు చేస్తే సర్వే నంబర్ లేదా పట్టాదారు వివరాల్లాంటి అంశాలను పొందుపరచాలి. కానీ ఆర్కైవ్స్ విభాగానికి విచిత్రమైన రీతిలో నాలుగు దరఖాస్తులు వచ్చాయి. నిజాం ఈ-అతియాత్ డిపార్ట్మెంట్లోని '105 ఆఫ్ మంచిరేవుల జడ్జిమెంట్ నంబర్ 187/1957 ఫైల్ నంబర్కు బంధించిన రికార్డులివ్వాలని నలుగురు దరఖాస్తు చేశారు. అందులో పట్టాదారు, సర్వేనంబర్లాంటి వివరాలేవీ లేకపోవడం గమనార్హం. అయినా చకచకా సమాచారం ఇవ్వడం అసాధారణరీతిలో సాగిపోయింది. ఈ వివాదంపై నార్సింగి ఠాణాలో 2018లో కేసు నమోదైంది.
సైబరాబాద్ పోలీసులు వివరాలివ్వాలని 2019 ఆగస్టు 26న ఆర్కివ్స్ విభాగం డైరెక్టర్కు లేఖ రాస్తే నెలల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేయడం అనుమానాలకు తావిచ్చే అంశంగా మారింది. దీంతో సైబరాబాద్ అప్పటి కమిషనర్ సజ్జనార్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని స్వయంగా లేఖ రాశారు. చివరకు 2021 ఫిబ్రవరి 8న డైరెక్టర్ జరీనా పర్వీన్ సమాధానం పంపించారు. అసలు ఫైల్ నంబర్ 105 ఆఫ్ మంచిరేవుల పేరుతో తమ కార్యాలయంలో ఎలాంటి రికార్డు లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఇలా ఏకంగా 72 ఎకరాల కోసం తప్పుడు పత్రాలు సృష్టించేందుకు యత్నించిన ముఠాలు ఈ దందా వెనక ఉన్నట్లు వెల్లడైంది. ఆ భూమి విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ.3,500కోట్ల మేర ఉండటం చూస్తే భూకబ్జాదారులు ఎలాంటి పథకం వేశారో అర్థం చేసుకోవచ్చు.
నిబంధనలకు విరుద్ధంగా డాక్యుమెంట్లు స్కానింగ్ :
ఇదిలా ఉంటే నూర్ మైక్రోఫిలింస్, వక్ఫ్ పాగా ఆర్వైవ్స్ విభాగంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఇరాన్కు చెందిన కంపెనీ మరోవైపు వక్ఫ్ బోర్డు ఉద్యోగులు పురాతన కాలంనాటి రికార్డులను నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ చేస్తుండటం వివాదం రాజేస్తోంది. నూర్ మైక్రో ఫిలింస్ ప్రతినిధులు ఆర్కైవ్స్ విభాగంలోని పర్షియన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసుకునేందుకు అనుమతి పొందారు. అయితే గతేడాది నవంబర్లోనే కాలపరిమితి ముగిసినా స్కానింగ్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుండటం అనుమానాలకు తావిచ్చే అంశంగా మారింది. ఈ విషయమై ఆర్కైవ్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ రెడ్డి వివరణ కోరగా ప్రస్తుత పరిణామాలపై ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించారు.
నకిలీ రికార్డులు సృష్టించిన టాలీవుడ్ నిర్మాత :
గతేడాది టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ మరికొందరితో కలిసి శివార్లలోని విలువైన ప్రభుత్వభూములపై కన్నేశారు. రాయదుర్గం సర్వేనంబర్ 46లో 83 ఎకరాలతోపాటు యాచారంలో 10 ఎకరాల భూములను సొంతం చేసుకునేందుకు కుట్ర పన్నారు. ఈక్రమంలోనే దాదాపు ఏడు దశాబ్దాల క్రితం ఆ భూముల పేరిట నకిలీ వారసులను తెర పైకి తెచ్చారు. వారి పేరిట నకిలీ ఫర్మానాలు సృష్టించారు. ఆర్కివ్స్ విభాగంలో కొందరు ఇంటిదొంగల్ని మచ్చిక చేసుకున్నారు. ఆ నకిలీ ఫర్మానాలను దొంగచాటుగా ఆర్కైవ్స్ విభాగం రికార్డుల్లోకి చేర్చారు. అనంతరం ఆ భూముల వివరాలు ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అడిగిందే తడవుగా ఆర్కివ్స్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ భూములు నకిలీ వారసులవేనంటూ సమాధానమిచ్చాడు.
ఏళ్ల తరబడి ఆమెదే ఆధిపత్యం :
తెలంగాణ ఆర్కివ్స్ పరిశోధనాలయంలో ఏళ్లుగా ఆమెదే గుత్తాధిపత్యం. ఈ విభాగానికి గతంలో డైరెక్టర్గా ఐఏఎస్లు ఉండేవారు. ఆ హోదాను నాన్ క్యాడర్కు తగ్గిస్తూ కొన్నేళ్ల క్రితం ఉన్నత విద్యాశాఖ జీవో నెంబర్ 95 జారీ చేసింది. అంతకుముందు డిప్యూటీ డైరెక్టర్గా ఉన్న జరీనా పర్వీన్ ఆ జీవో ప్రకారమే 2007లో డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆ విభాగంలో రెండు దశాబ్దాలపాటు సేవలందించడంతోపాటు పర్షియన్ లాంగ్వేజ్ స్కాలర్గా విశేష అనుభవమున్న నేపథ్యంలో ఆమెకు బాధ్యతలు అప్పగించారు. మధ్యలో రెండేళ్లపాటు కిస్మత్కుమార్ పనిచేసినా తర్వాత ఆమే కొనసాగారు.
రాష్ట్రవిభజన అనంతరం ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ శాఖకు సైతం ఆమె సారథ్యం వహించారు. పదేళ్ల క్రితమే ఆమె ఉద్యోగ విరమణ చేశారు. అయినా ఇప్పటివరకు కొత్త డైరెక్టర్ను నియమించలేదు. ఏటా ఆమె సర్వీసును ఏడాదికాలం పొడగిస్తూ ఉత్తర్వులు జారీ అవుతుండటం గమనార్హం. రాజధానిలో కీలకంగా ఉన్న ఓ రాజకీయపార్టీ నేత సిఫారసుతోనే ఆమెను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆర్క్వైవ్స్ శాఖ ఉద్యోగులు కార్యాలయంలో ఆందోళన నిర్వహించి ఏకంగా ఆమె పేరుతో ఉన్న బోర్డును తొలగించడం సంచలనం కలిగించింది.
COMMENTS