COWS DIES IN VEMULAWADA
రాజన్నా! - నీ కోడెలను నువ్వే కాపాడుకోవయ్యా..
సామర్థ్యానికి మించి గోవులు ఉండటంతో ఇరుకుగా మారిన గోశాల! - మేత తినే సమయంలో జరిగే పోట్లాటలో గాయాలపాలై మృత్యువాత పడుతున్న ఘటనలు
Kodelu Died At Vemulawada Temple : కోడె చెల్లింపు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి(రాజన్న) మాత్రమే సొంతమైన ప్రత్యేక మొక్కు ఇది. కొందరు భక్తులు ఇంటి నుంచి నిజ కోడెలను తీసుకొస్తారు. మరికొందరు ఇక్కడే గోశాలలో ఉన్నటువంటి వాటితో మొక్కులు తీర్చుకుంటారు. ఈ కోడెల సంరక్షణకు కోసం ప్రత్యేకంగా గోశాల ఉంది. 6 ఎకరాల విస్తీర్ణంలోని గోశాలలో ఆరు షెడ్లు ఉన్నాయి. ఒక్కో షెడ్డులో గరిష్ఠంగా 50 కోడెలు వరకు ఉంచొచ్చు. అంటే మొత్తం 300 కోడెలకు సరిపోతుంది.
ప్రస్తుతం ఉన్న గోశాలలో కోడెల సంఖ్య 1,230. గోశాలలో పొరుగుసేవల విభాగంలో 2 సహాయకులే ఉన్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి కోడె మొక్కుల ద్వారా ఏటా సుమారు రూ.23 కోట్ల ఆదాయం సమకూరుతోంది. గోశాలలోని కోడెల సంరక్షణకు ఆలయ బడ్జెట్లో ఏటా రూ.50 లక్షలపైనే నిధులను కేటాయిస్తున్నారు. సామర్థ్యానికి మించి కోడెలు ఉండటం వల్ల గోశాల ఇరుకుగా మారింది. మేత తినే సమయంలో జరిగే పోట్లాటలో గాయాలపాలైన కోడెలు సరైన చికిత్స అందక మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
అవగాహన లేమితో సమస్య:
మొక్కు సమర్పించేటువంటి భక్తులు పాలు మరవని, బక్కచిక్కిన, జెర్సీ జాతి కోడెలను ఇక్కడకు తీసుకొస్తున్నారు. వాటిని వాహనాల్లో కుక్కి తీసుకురావడం వల్ల వస్తున్నప్పుడే కోడెలు గాయాల పాలవుతున్నాయి. ఆలయ రూల్స్ ప్రకారం అనారోగ్యంతో ఉన్నవి పాలు మరవని కోడెలను సిబ్బంది తీసుకోరు. దీంతో భక్తులు వాటిని వేములవాడ ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్తున్నారు. ఈ విషయమై ఆలయ ఈవో(కార్యనిర్వాహణా అధికారి) వినోద్రెడ్డిని’ సంప్రదించగా గోశాలలో అదనపు సిబ్బందిని నియమించడంతోపాటు ప్రత్యేకంగా 2 పశువైద్యులతో ఒక వైద్యశాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
మరో ఆరు కోడెల మృతి :
ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మంగళవారం మరో 6 కోడెలు మృతి చెందినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్రెడ్డి ప్రకటించారు. గత 5 రోజుల్లో మొత్తం 26 కోడెలు మృతి చెందాయని మరో 14 అనారోగ్యంతో ఉన్నాయని ఆయన తెలిపారు.
COMMENTS