BTECH STUDENTS ANTI DRONE SYSTEM
బీటెక్ స్టూడెంట్స్ వినూత్న ఆవిష్కరణ- శత్రుదేశాల డ్రోన్లను కూల్చేసే యాంటీ డ్రోన్ సిస్టమ్ అభివృద్ధి.
భూమి నుంచి 1500 అడుగుల ఎత్తులో ఉన్న డ్రోన్లను కూల్చేసే వ్యవస్థను అభివృద్ధి చేసిన బీటెక్ విద్యార్థులు.
Btech Students Anti Drone System : దేశ సైనికులకు ఉపయోగపడే విధంగా వినూత్న ఆవిష్కరణ చేపట్టారు ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు. భూమి నుంచి 1500 అడుగుల ఎత్తులో ఉన్న డ్రోన్లను నాశనం చేయగల యాంటీ డ్రోన్ సిస్టమ్ (పోర్టబుల్ జామర్లు)ను తయారు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు స్టూడెంట్స్పై ప్రశంసలు కురుస్తున్నాయి.
బీటెక్ స్టూడెంట్స్ ప్రయోగం
మేరఠ్లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో దీక్షంత్ కుమార్, మనోహర్ కుష్వాహా బీటెక్ చదువుతున్నారు. వీరిద్దరూ కలిసి 10 కిలోల బరువున్న పోర్టబుల్ జామర్ను తయారు చేశారు. తక్కువ బరువు ఉండడం వల్ల దీనిని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ పోర్టబుల్ జామర్ ఇండియన్ ఆర్మీకి నచ్చింది. ఈ క్రమంలో విద్యార్థుల నుంచి కొనుగోలు చేసింది. ఇద్దరు స్టూడెంట్స్ జామర్ను అభివృద్ధి చేయడానికి ప్రయోగశాలలో చాలా శ్రమించారు.
యాంటీ డ్రోన్ వ్యవస్థ
"రెండేళ్ల క్రితం నేను మనోహర్తో కలిసి హ్యాకథాన్ పోటీలో పాల్గొన్నాను. అక్కడ డ్రోన్ల కోసం జామర్లను తయారు చేయడానికి ఒక చిన్న ప్రాజెక్ట్ ను రూపొందించారు. మేము అభివృద్ధి చేసిన మొదటి పోర్టబుల్ జామర్ (యాంటీ డ్రోన్ సిస్టమ్) సైన్యానికి నచ్చింది. వైమానిక డ్రోన్ దాడులను అడ్డుకోవడానికి అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థను రూపొందించాం. యాంటీ డ్రోన్ వ్యవస్థ దాదాపు ఒక కిలోమీటరు వ్యాసం కలిగిన వర్చువల్ డోమ్ ను సృష్టిస్తుంది. ఏదైనా డ్రోన్ జోన్ లోకి ప్రవేశించినట్లయితే అది జామ్ అవుతుంది (బ్లాక్ చేస్తుంది)" అని దీక్షంత్ తెలిపారు.
ఆర్మీ నుంచి ఆర్డర్లు!
మహారాష్ట్ర 90 సాయుధ రెజిమెంట్ కెప్టెన్ అక్రమ డ్రోన్లను ఆపడానికి సాంకేతికతను ఉపయోగించడానికి ఆసక్తి చూపారని మనోజ్ కుష్వాహా తెలిపారు. తమ కృషి ఫలించి జామర్లను జనవరి 2025లో సైన్యానికి విజయవంతంగా అప్పగించామన్నారు. మళ్లీ పంజాబ్లోని పాటియాలా రెజిమెంట్ 77కి కూడా పరికరాలు సరఫరా చేశామని పేర్కొన్నారు. ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు తాము కొన్ని ఇతర రక్షణ ప్రాజెక్టులపై కూడా పని చేస్తున్నామని వెల్లడించారు.
"యాంటీ డ్రోన్ జామర్ బరువు దాదాపు 10 కిలోలు. ప్రస్తుతం దాని బ్యాటరీ బ్యాకప్ ఒక గంట. మేము దాని సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ వ్యవస్థ భూమి నుంచి 1500 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను గుర్తించి నాశనం చేయగలదు. 1500 అడుగుల ఎత్తు వరకు ఏదైనా డ్రోన్ ఉంటే, అది ఈ యాంటీ డ్రోన్ జామర్ నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ఈ జామర్లకు చాలా ప్రాంతాల నుంచి డిమాండ్ ఉంది. యాంటీ డ్రోన్ వ్యవస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేశాం" అని కుశ్వాహా పేర్కొన్నారు.
COMMENTS