RAILWAY SAFETY TIPS IN TELUGU
వేసవిలో ట్రైన్ ప్రయాణం చేస్తున్నారా? - అయితే ఈ జాగ్రత్తలు మరవొద్దు
రైళ్లలో వేసవి దొంగలు హల్చల్ - వరుస చోరీలతో ప్రయాణికులు హడల్ - ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ సామాన్లు సేఫ్.
Train Journey Safety Tips : అసలే వేసవికాలం అంటేనే సమ్మర్ హాలిడేస్ ప్రయాణాలు ఎక్కువ. దీంతో ఎక్కువ మంది రైళ్లనే ఎక్కువగా ప్రిపర్ చేస్తారు. ఈ ప్రయాణాలతో రైళ్లన్నీ రద్దీగా మారాయి. పర్యాటక ప్రాంతాలు, తీర్ధయాత్రలు, సొంతూళ్లకు వెళ్లే కుటుంబాలతో బోగీలన్నీ కిటకిటలాడిపోయిన్నాయి. ప్రయాణికులు కేవలం గమ్యం చేరాలనే ఆలోచనలో పరిసరాలను కూడా పట్టించుకోకుండా ప్రయాణం చేస్తున్నారు.
ఇదే ఇప్పుడు దొంగలకు అదునుగా మారింది. దీంతో వారు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులు ఏమరుపాటుతో ఉంటూ బాధితులు సొత్తును లూటీ చేస్తుండటంతో సమీపంలోని రైల్వే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలా సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలోనే ఏటా 1000కి పైగా దొంగతనాలపై ఫిర్యాదులు అందుతున్నాయి.
ఎక్కువగా తెల్లవారుజామునే : రైళ్లలో చోరీలు అధికశాతం తెల్లవారుజామునే జరుగుతున్నాయని తెలుస్తోంది. దూర ప్రయాణాలతో అలసిపోయిన ప్రయాణికులు ఆదమరచి నిద్ర పోగానే దొంగలు వారి చేతికి పని చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందిన చిల్లర దొంగలు ముఠాలుగా ఏర్పడి వరుస చోరీలకు పాల్పడుతూ రైల్వే ప్రయాణికులను హడలెత్తేస్తున్నారు.
ఇలా నేరాలను కట్టడి చేస్తూ చర్యలు తీసుకుంటున్నాం : రైలు బోగీలు, రైల్వే స్టేషన్లలో నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ జావేద్ తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బందితో బందోబస్తు పెంచామన్నారు. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికులు భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సిగ్నల్ ట్యాప్ చేసి రైలు ఆగే సమయంలో దోపిడీలకు పాల్పడే ముఠాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం జేబు దొంగలు, చైన్స్నాచర్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని వివరించారు. దూర ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు ధరించకపోవటం ఉత్తమమని చెప్పారు.
టోల్ఫ్రీ నంబర్ : అనుమానితులు కనిపించినా, చోరీ జరిగినా వెంటనే డయల్ 100, 139కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని అన్నారు.
ఈ విషయాలు గుర్తించండి :
వేగం తగ్గిందా.. సొమ్ము మాయం చేస్తారు అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
దొంగలు రూటు మార్చారు. రైలు కదిలే ముందు, వేగం తగ్గాక దొంగతనాలకు పాల్పడుతున్నారు.
కిటికీలు, ద్వారాల వద్ద కూర్చొని ఉన్న మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్, చైన్స్నాచింగ్లతో హడలెత్తిస్తున్నారు.
ఈ మధ్యనే జరిగిన కొన్ని ఘటనలు :
లింగంపల్లి ఆదర్శనగర్లో ఉండే ప్రైవేట్ ఉద్యోగిని ఇటీవల విజనగరం వెళ్లారు. గత నెల 11న తిరిగి సికింద్రాబాద్ వచ్చేందుకు నాగవళ్లి ఎక్స్ప్రెస్ ఎక్కారు. 12న తెల్లవారు జామున అగంతకుడు ఆమె మెడలోని 38గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.
బాపట్లకి చెందిన యువకుడు తల్లితో కలిసి గత నెల 18న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చాడు. తిరిగి చీరాలకు వెళ్లేందుకు సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కగా.. రైలు బయల్దేరే సమయంలో ప్లాట్ఫాం వద్దనున్న గుర్తుతెలియని వ్యక్తి యువకుడి తల్లి మెడలోని బంగారు అభరాణాన్ని లాక్కొని వెళ్లిపోయాడు.
COMMENTS