Success Story: A woman who started with 10 thousand and grew to Rs. 4 thousand crores.. Real success..
Success Story: 10 వేలతో మెుదలై రూ.4 వేల కోట్లకు ఎదిగిన మహిళ.. అసలైన సక్సెస్..
Shashi Soni: ఒక మహిళ వేల కోట్ల కంపెనీని నిర్మించటం అంత తేలిక కాదు. అవకాశాల కోసం క్యూ కడుతున్న ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారాలు నడపాలనుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. అయితే వేల కోట్ల వ్యాపారాన్ని నిర్మించిన శశి సోనీ జీవితం చాలా మంది యువతకు మార్గనిర్థేశకంగా నిలుస్తోంది.
గమ్యంపై దృష్టి సారించి ముందుకు సాగితే ఒడిదొడుకుల ప్రయాణం సైతం సునాయాసంగా పూర్తవుతుందని చెబుతుంటారు. ఇది మహిళా వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన శశి సోనీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. తన బలీయమైన కోరికతో కేవలం రూ.10,000 ప్రారంభ పెట్టుబడితో వ్యాపార పునాదిని వేశారు. తర్వాతి కాలంలో ప్రారంభించిన ఇజ్మో లిమిటెడ్ కంపెనీ విలువ నేడు రూ.4,000 కోట్లకు పైగా ఉండటం గమనార్హం.
శశి సోనీ వాస్తవానికి పాకిస్థాన్ లోని లాహోర్ పట్టణంలో 1941, ఏప్రిల్ 4న జన్మించారు. అయితే స్వాతంత్య్రం నాటికి వారి కుటుంబం దిల్లీ నగరానికి వచ్చేసింది. అక్కడే ఆమె తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అలా 1971లో తొలిసారిగా రూ.10,000తో ట్రాన్స్ పోర్ట్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. 1975 వరకు దీనిని నడిపిన తర్వాత 1975లో ముంబైలోని ములుంద్ ప్రాంతంలో దీప్ మందిర్ సినిమా పేరుతో మొదటి ఏసీ థియేటర్ ప్రారంభించి దాదాపు ఐదేళ్ల పాటు నడిపారు. అయితే దీని తర్వాత మైసూరు కేంద్రంగా ప్రారంభించిన ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారం దశ తిరిగేలా చేసింది. భారీగా సంపాదనను శశికి అందించింది.
అలా వచ్చిన సొమ్ముతో శశి సోనీ 2005లో izmo ltd పేరుతో మార్కెట్ పరిష్కారాలను అందించే ఒక టెక్ కంపెనీని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికా, ఆసియా, యూరప్ దేశాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. సేవా కార్యక్రమాల్లో సైతం చురుకుగా ఉండే శశి మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించటంలోనూ ముందుంటారు. మహిళా వ్యాపారవేత్తగా, సామాజిక సంక్షేమంలో శశి చేసిన పనిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెకు తాజాగా పద్మశ్రీ అందుకున్నారు. గతంలోనూ ఆమె చేసిన కృషికి పలు అవార్డులు వచ్చాయి.
COMMENTS