Coconut in hand, water in a cup can smell the trace of water inside the earth... What does science say?
చేతిలో కొబ్బరికాయ, చెంబులో నీళ్లు భూమి లోపల నీటి జాడను పసిగడతాయా... సైన్స్ ఏం చెబుతోంది?
చంద్రుడిపై నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకునేంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా.. నేటికీ భూగర్భంలో నీటి జాడ వెతికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంప్రదాయ పద్ధతులనే ఇంకా అనుసరిస్తున్నారు.
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపైనే ఆధారపడే రైతులకు భూగర్బ శాస్త్రవేత్తల(జియాలజిస్టులు)ను పిలిపించి తమ పొలాల్లో నీటిజాడలను కనుగొనే సమయం, స్తోమత ఉండవు.
దీంతో, చాలా మంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయించడానికి పొలాల్లో నీటి జాడ తెలిపే వారిని పిలిపించుకుంటారు. వాళ్లు పొలంలో ఎక్కడ నీటి వనరులు ఉన్నాయని చెబుతారో అక్కడ వాటర్ పాయింట్ (నీటి జాడ ఉందని భావించే ప్రాంతం) పెట్టించుకుని, బోరు వేయించుకోవడం లాంటివి చేస్తున్నారు.
ఇలా వాటర్ పాయింట్లు పెట్టే వారు నీటి జాడ కనుగొనేందుకు కొబ్బరికాయ, వై ఆకారంలో ఉండే వేప పుల్ల, చెంబులో నీళ్లు లాంటివి ఉపయోగిస్తుంటారు.
అసలు ఇలాంటి పద్ధతులు శాస్త్రీయమేనా? రైతులు, జియాలజిస్టులు ఏమంటున్నారు? వీరిని నమ్ముకుని బోర్లు వేయించుకున్న రైతులు ఏం చెబుతున్నారు. వాటిని ఎంత వరకూ నమ్మొచ్చు వంటి విషయాలను బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
మూడు పద్ధతుల్లో నీటి జాడ గుర్తింపు..
తనకు తెలిసిన కొన్ని పద్ధతుల ద్వారా నీటి జాడలు గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చాలా మంది రైతులకు ఆయన వాటర్ పాయింట్లు పెట్టారు.
ఆయనది చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పోలవరం. రైతు పొలంలో నీటిజాడ కనిపెట్టేందుకు కొబ్బరికాయ, వై ఆకారంలో ఉండే వేపపుల్ల లేదా కానుగపుల్ల, నీళ్ల చెంబును ఆయన ఉపయోగిస్తుంటారు.
కొబ్బరి పీచు వేళ్ల వైపు ఉండేలా అరచేతిలో కొబ్బరికాయను పట్టుకుంటారు. పొలంలో ముందుకు నడుస్తున్నప్పుడు ఎక్కడైతే ఆ కొబ్బరికాయ నిట్టనిలువుగా నిలుస్తుందో అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు.
లేదంటే, వై ఆకారంలో ఉన్న వేపపుల్లను అరచేతుల్లో పెట్టుకుని ముందుకు నడుస్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుందని.. ఒకవేళ నీళ్లు ఎక్కువగా ఉంటే అది గిరగిరా తిరుగుతుందని చెబుతున్నారు. ఇక నీళ్ల చెంబు పద్ధతిలో ఎక్కడైతే చెంబులో నీళ్లు పక్కకు ఒలుకుతాయో అక్కడ నీళ్లు ఉన్నాయని బోరు వేయవచ్చని సురేందర్ రెడ్డి చెబుతున్నారు.
“నేను బోరు పాయింట్లు చూస్తుంటా. ఈ విద్యను నేనే స్వయంగా నేర్చుకున్నా. భూగర్భంలో వాటర్ లెవల్ ఫోర్సును బట్టి తెలుస్తుంది. కొబ్బరికాయ లేవడం బట్టి ఎన్ని అడుగుల్లో నీళ్లు ఉన్నాయో తెలుస్తుంది” అని ఆయన అన్నారు.
జియాలజిస్టులు యంత్రాల ద్వారా చెక్ చేసినా ఎన్ని నీళ్లు పడతాయో సరిగ్గా చెప్పలేరని, కానీ తాను గుర్తించిన పాయింట్లలో 99 శాతం విజయవంతం అయ్యాయని సురేందర్ రెడ్డి చెప్పారు. పాతికేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నానని ఆయన అన్నారు.
‘‘జియాలజిస్టులు మిషన్తో చెక్ చేస్తారు కానీ, వాళ్లకు మాకు వచ్చినంత క్లారిటీగా తెలియదు. అందుకే జియాలజిస్టులపై రైతులు ఎక్కువగా నమ్మకం పెట్టుకోరు. రైతులు ఎక్కువగా తమ కళ్లతో చూసిందే నమ్ముతారు” అని సురేందర్ రెడ్డి అన్నారు.
“నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు, నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు కూడా వస్తాయి” అన్నారు సురేందర్ రెడ్డి.
అవి అశాస్త్రీయ పద్ధతులు...
ఇలా కొబ్బరికాయ, వేపపుల్ల, నీళ్ల చెంబుతో నీటి జాడ గుర్తించే విధానాలను అన్సైంటిఫిక్ (అశాస్త్రీయ) అని చెబుతున్నారు తిరుపతికి చెందిన జియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ అండ్ మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి.
“టెంకాయ లేదంటే ఉత్తరేణి పుల్ల, వేప పుల్ల, తర్వాత రేగి చెట్టు పుల్లలు తీసుకుని కొంతమంది నీటి జాడలు గుర్తిస్తూ ఉంటారు. వాళ్లు దాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటే కిందికి ఉన్నది పైకి లేస్తుంది. అక్కడ నీళ్లు ఉన్నాయని, అక్కడ బోరు వేసుకోమని చెబుతారు. కానీ వీటిని అశాస్త్రీయ పద్ధతులుగా భావించాలి” అన్నారాయన.
కొంతమంది తమ చేతిలో జలరేఖ ఉందని, దేవుడు కలలో కనిపించి నీళ్లు ఎక్కడ పడతాయో తమకు చెప్పారని కూడా చెబుతుంటారని సుబ్బారెడ్డి చెప్పారు.
కానీ, శాస్త్రీయ పద్ధతుల ద్వారా మాత్రమే నీటి జాడను కచ్చితంగా గుర్తించగలమని చెప్పారు.
పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పుడు ఏ పద్ధతిని అనుసరించి చెప్పినా నీళ్లు పడతాయి. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా చెప్పినా నీళ్లు పడతాయి. రైతులు ఆ పద్ధతులను నమ్మడానికి కారణం అదేనని సుబ్బారెడ్డి చెబుతున్నారు.
“కొన్ని ఏరియాల్లో ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. నీళ్లు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో ఎలా వాటర్ పాయింట్ పెట్టినా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే కొన్ని ఛాలెంజింగ్ ప్రాంతాల్లో.. అంటే, వెయ్యి అడుగులు బోరు వేసినా నీళ్లు పడని కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అలాంటి చోట్ల ఏ పద్ధతిలో అయినా నీటి జాడలు గుర్తించడంలో విఫలమయ్యే అవకాశాలు ఉంటాయి'' అని సుబ్బారెడ్డి చెప్పారు.
అందుకే అలాంటి ప్రాంతాల్లో శాస్త్రీయ పద్ధతులతో నీటి జాడకోసం జియాలజిస్టులు ప్రయత్నించినా అక్కడ నీళ్లు రావని, అలాంటి చోట బోరు వేసినా డబ్బులు వృథా అవుతుందని తామే రైతులకు సలహా ఇస్తుంటామన్నారాయన.
శాస్త్రీయ పద్ధతుల కచ్చితత్వమెంత...
అశాస్త్రీయ పద్ధతులు పక్కన పెడితే, భూగర్భంలో నీటి జాడలు వెతకడానికి సైంటిఫిక్, సెమీ సైంటిఫిక్ పద్ధతులు సమర్థమైనవని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ నీటి జాడ గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న శాస్త్రీయ పద్దతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటని ఆయన చెప్పారు.
‘‘ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలించినపుడు మనకు భూమి అడుగున పొరలు పొరలుగా ఉంటుంది. రాళ్లు, మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనా వేస్తాం. వచ్చే వాల్యూల ఆధారంగా ఒక గ్రాఫ్ గీసుకుంటాం. ఫలితాలు ఎక్కడైనా అనుకూలంగా వచ్చాయా లేదా అని చూసుకుని నీటి జాడలను నిర్దారించుకుంటాం'' అని సుబ్బారెడ్డి చెప్పారు.
భూగర్భంలో నీటి జాడల లోతు తెలుసుకోవడానికి సాఫ్ట్వేర్స్ కూడా వినియోగిస్తామన్నారు.
‘‘ఈ టెక్నిక్స్లో కేసింగ్ ఇన్ని అడుగుల్లో పడుతుంది. ఫస్ట్ లేయర్ ఇన్ని అడుగుల్లో వస్తుంది. సెకండ్ లేయర్ ఇన్ని అడుగుల్లో వస్తుంది. తర్వాత వెళ్లొద్దండి. కంప్లీట్గా హార్డ్ రాక్ ఉంది. కాబట్టి ఇక డ్రిల్లింగ్ చేయొద్దని సైంటిఫిక్ మెథడ్లో డిసైడ్ చేసి చెబుతాం'' అని ఆయన తెలిపారు.
పెండ్యులం మెథడ్, ఎల్ రాడ్ మెథడ్లను సెమీ సైంటిఫిక్ పద్ధతులుగా సుబ్బారెడ్డి చెప్పారు. ఆ రెండు పద్ధతుల ద్వారా ఏ దిశలో నీటి జాడలు వెళ్తున్నాయనేది గుర్తించవచ్చని, కానీ ఎంత లోతులో నీళ్లు పడతాయో కచ్చితంగా చెప్పలేమన్నారు.
అవి బయో ఇండికేటర్స్
నీటి జాడలు గుర్తించే ప్రయత్నాలు పూర్వీకుల నుంచే జరిగినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. భూమి భౌగోళిక లక్షణాలను బట్టి కూడా కొందరు నీటి జాడలు అంచనా వేస్తారని తెలిపారు.
‘‘హిందూ విశ్వాసాల ప్రకారం, వరాహ మిహిరుడు భూగర్భంలో నీటి వనరులను ఎలా గుర్తించవచ్చు అనేదానిపై ఒక గ్రంథం రాశాడు. జల అన్వేషణపై ఉన్న ఆ గ్రంథంలో బయో ఇండికేటర్స్ ప్రస్తావన ఉంది. వీటిలో ఊడగ, రెల్ల, మద్ది, తంగేడు లాంటి చెట్లు లాంటివి నీళ్లు ఉన్న చోట గుంపుగా ఉంటాయని పూర్వీకుల నుంచీ ఒక నమ్మకం బలంగా ఉంది’’
జియాలజిస్టులు కూడా ఇలాంటి సంకేతాలను అన్వేషిస్తుంటారని, అలాంటి ప్రాంతాల్లో నీళ్లు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
‘‘పుట్టలు ఉన్నచోట కూడా నీళ్లు పడతాయని చెబుతారు. ఇవి కొంతవరకూ నిరూపితం అయ్యాయి కూడా. పుట్టకు నీళ్లు ఏ దిశలో పడతాయి అనేది వాటిని సర్వే చేసే వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. సెమీ సైంటిఫిక్ పద్ధతులతోపాటు, బయో ఇండికేటర్స్ని కూడా జియాలజిస్ట్ పరిగణనలోకి తీసుకుంటాడు'' అని సుబ్బారెడ్డి చెప్పారు.
8 సార్లు ఫెయిలైంది..
బోర్లు వేసుకునేప్పుడు ఇద్దరు ముగ్గురిని పిలిపించి నీటి జాడలు ఎక్కడున్నాయో ధ్రువీకరించుకుంటామని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన రైతు మునికృష్ణారెడ్డి చెప్పారు.
టెంకాయతో పాయింట్ పెట్టేవారితోపాటు, జియాలజిస్టులను కూడా పిలిపించి అందరూ చెప్పిన పాయింట్లో బోరు వేశామన్నారు.
‘‘మొదట ఒకచోట 9 బోర్లు వేసినప్పుడు 8 బోర్లలో చుక్క కూడా నీరు రాలేదు. దాంతో చాలా నష్టపోయాం. ఇంకో బోరులో ఒక ఇంచ్ నీళ్లు వచ్చాయి. కొంతమంది టెంకాయ పెట్టుకుని చూస్తారు. ఇంకొంత మంది వేప పుల్ల, కానగపుల్ల, కొంత మంది రాగి కమ్మితో కూడా చూస్తారు. ఇంతకు ముందు అయితే బోర్లు వేసి వేసి దెబ్బతిన్నాం. అందుకే ఇప్పుడు ఇద్దరు ముగ్గరిని పిలుచుకుని రావడం, వాళ్లందరూ ఎక్కడ బోరు వేయొచ్చు అని చెబితే అక్కడే బోరు వేస్తున్నాం’’ అని కృష్ణా రెడ్డి చెప్పారు.
అశాస్త్రీయ పద్ధతులతోపాటు, కొన్నిసార్లు జియాలజిస్టులు పెట్టిన పాయింట్లు కూడా ఫెయిలయ్యాయని మునికృష్ణారెడ్డి చెప్పారు.
‘‘10 ఎకరాలు ఉంటే, ఆ పది ఎకరాల్లో నీళ్ల కోసం వెతకడం కష్టం. అందుకే సురేందర్ రెడ్డి లాంటి వారిని పిలిస్తే ఈజీగా నడిచి వెళ్తూ ఒక పాయింట్ గుర్తిస్తారు. వాళ్లు గుర్తించిన చోట మళ్లీ జియాలజిస్టును కూడా పిలిపించి చూపిస్తాం. వాళ్లుకూడా అక్కడ నీళ్లు ఉన్నాయని నమ్మకంగా చెబితే అప్పుడు బోరు వేసుకుంటాం’’ అని ఆయన అన్నారు.
అనుభవం కీలకం...
‘‘చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్ గుర్తిస్తున్నామంటే, జిల్లాలో ఎంత లోతులో నీళ్లు పడతాయి. ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుంది అనే ఒక అవగాహన ఉండాలి. నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను కాబట్టి, నాకు ఇది సులభమే. అదే కొత్త ప్రాంతంలో చూస్తే, అక్కడి జియాలజిస్టుకు కమాండింగ్ ఉంటుంది. వాళ్లకి అక్కడ నాకంటే ఎక్కువ సక్సెస్ ఉంటుంది'' అన్నారు సుబ్బారెడ్డి.
కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా తాము బయో ఇండికేటర్గా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
“వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు, ఆకులు ఒక వైపు వంగినట్లు ఉంటే.. అలాంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట నీటి దారి పోతుందని సూచన. అలాంటి ఏరియాలో పరికరాలు ఎక్కడ సెట్ చేసుకుంటున్నామన్నదే ప్రధానం. అది జియాలజిస్టుకి ఆ ప్రాంతంపై ఉన్న అవగాహన, అనుభవంపై ఆధారపడి ఉంటుంది” అన్నారు.
కొన్నిసార్లు రాతిపొరల వల్ల సవాళ్లు ఎదురవుతాయని, అలాంటి చోట్ల జియాలజిస్టులు మాత్రమే నీటి వనరులు గుర్తించగలరని చెప్పారు.
భూగర్భంలో నీటిని గుర్తించే టెక్నాలజీ 1910 నుంచి అభివృద్ధి చెందుతూ వస్తోందని, ఫ్లైట్లో వెళ్తూ కూడా కింద నీటి జాడలు ఎలా ఉన్నాయో తెలుసుకునే సర్వేలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
చదువుకున్న వాళ్లు శాస్త్రీయ పద్ధతులను వంద శాతం నమ్మవచ్చని, కానీ అశాస్త్రీయ పద్ధతులకు ఒక కారణం ఉండదు కాబట్టి వాటిని నమ్మలేమని తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జియాలజీ విభాగం హెడ్ డాక్టర్ సురేష్ చెప్పారు.
‘‘సైంటిఫిక్గా చేసి చూపిస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. జియో ఫిజికల్ మెథడ్, మ్యాగ్నెటిక్ మెథడ్స్, సీస్ మిక్ మెథడ్స్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్. ముఖ్యంగా భూమిలో నీటి జాడకోసం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ ఎక్కువగా వాడతారు.’’
COMMENTS