Can train accidents be prevented? It is possible if India learns from these countries.
రైలు ప్రమాదాలను నివారించవచ్చా ? ఈ దేశాల నుంచి భారత్ నేర్చుకుంటే అది సాధ్యమే.
ఒడిశా రైలు ప్రమాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కపడింది. ఈ ప్రమాదం భారత రైలు భద్రతా సామర్థ్యాలపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 288 మందికిపైగా మృతి చెందగా, వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పడం వల్ల, ఢీకొనడం వల్ల వినాశకరమైన పరిణామాలు ఎదురవుతాయి. వీటి వల్ల భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతాయి. ఒడిశా ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ.
కాగా.. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి ప్రమాదాలను నివారించే సామర్థ్యం కూడా పెరిగింది. రైలు పట్టాలు తప్పకుండా చూసేందుకు, ఢీకొనడాన్ని నివారించడానికి ఉపయోగించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. వాటిని అనేక దేశాలు ఉపయోగించుకుంటూ ప్రమాదాలను నివారిస్తున్నాయి. అలాంటి రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తూ, ప్రమాదాలను అరికట్టడంలో విజయవంతమైన దేశాల నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఏ దేశాల్లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఆ దేశాలేవి అనే విషయాన్ని ఒక సారి పరిశీలిద్దాం.
1. అడ్వాన్స్ సిగ్నలింగ్ సిస్టమ్
ఆధునిక రైళ్లలో అడ్వాన్స్ సిగ్నలింగ్ వ్యవస్థ చాలా ముఖ్యం. చాలా దేశాల్లో రైళ్లలో పాజిటివ్ ట్రైన్ కంట్రోల్ (పీటీసీ) వంటి అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు ఉంటాయి. పీటీసీ సాంకేతికత రైలు కదలికలను పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి జీపీఎస్, వైర్లెస్ కమ్యూనికేషన్, ఆన్ బోర్డ్ కంప్యూటర్ల కలయికను ఉపయోగిస్తుంది. పీటీసీ వ్యవస్థ కమ్యూనికేషన్-ఆధారిత, ప్రాసెసర్-ఆధారిత రైలు నియంత్రణ సాంకేతికత రైళ్లు ఢీకొనడం, అతివేగంతో పట్టాలు తప్పడం, తప్పుగా అమర్చిన స్విచ్లను బలంగా, క్రియాత్మకంగా నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ప్రమాదాన్ని నివారించేందుకు ఈ టెక్నాలజీ అవసరమైతే ఆటోమేటిక్ గా బ్రేకులు వేయగలదు.
2. ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఎఎస్)
ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్స్ (టీసీఎఎస్) ఇతర రైళ్లు, వాహనాలు లేదా పాదచారులతో పాటు పట్టాలపై ఉన్న అడ్డంకులను గుర్తించడానికి రాడార్, లైడార్, ఇతర సెన్సార్ టెక్నాలజీలను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థలు ట్రైన్ ఆపరేటర్లకు (లోకో పైలట్లు) రియల్ టైమ్ అలర్ట్ లను అందిస్తాయి. ఇది ఘర్షణలను నివారించడానికి తక్షణ చర్య తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
3. ఆటోమేటెడ్ ట్రాక్ ఇన్స్పెక్షన్ (ఏటీఐ)
ప్రమాదాలు జరకుండా ఉండాలంటే ట్రాక్ లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం ఆటోమేటిక్ ట్రాక్ ఇన్స్పెక్షన్ టెక్నాలజీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. లేజర్లు, కెమెరాలు వంటి ఏటీఐ టెక్నాలజీని కలిగి ఉన్న ట్రాక్ జామెట్రీ కార్లు ట్రాక్ పరిస్థితులను త్వరగా అంచనా వేయగలవు. లోపాలు, అసాధారణతలను గుర్తించగలవు. ఈ కార్లను ట్రాక్ రికార్డింగ్ కార్లు అని కూడా పిలుస్తారు. సాధారణ రైలు కార్యకలాపాలకు అంతరాయం కలిగించకుండా ట్రాక్ జ్యామితి అనేక పరామీటర్లను పరీక్షించడానికి వీటిని ఉపయోగిస్తారు. ఇది సకాలంలో మెయింటెనెన్స్, మరమ్మతులకు అవకాశాలను కల్పిస్తుంది. పట్టాలు తప్పే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. ప్రమాద అవకాశాలను గుర్తించడం, నిర్వహించడం..
ప్రమాదం జరిగే అవకాశాలను గుర్తించేందుకు అనేక సాంకేతికతలు ఉన్నాయి. ఇలాంటి పద్ధతులను అమలు చేయడం వల్ల సంభావ్య రైలు సంబంధిత లోపాలు సంభవించే ముందు వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. రైళ్లలో ఉష్ణోగ్రత, వైబ్రేషన్, మానిటరింగ్ సిస్టమ్స్ వంటి సెన్సార్ల నుండి డేటాను విశ్లేషించడం ద్వారా, నిర్వహణ బృందాలు ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించగలవు. దీని వల్ల ప్రమాదాలను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు.
5. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్
ప్రమాదాలను నివారించడానికి రైలు ఆపరేటర్లు, కంట్రోల్ సెంటర్లు, నిర్వహణ సిబ్బంది మధ్య మంచి కమ్యూనికేషన్ అవసరం. వైర్ లెస్ డేటా నెట్ వర్క్ లు, రియల్ టైమ్ రిపోర్టింగ్ టూల్స్ తో పాటు ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు సమాచారాన్ని వేగంగా ప్రసారం చేయడానికి వీలు కల్పిస్తాయి. ఏదైనా పరిస్థితిలో ఒక టీమ్ ను మరొక టీమ్ తో సమన్వయం చేస్తూ ప్రమాదాన్ని నివారించవచ్చు.
రైలు ప్రమాదాల నివారణలో ముందంజలో ఈ దేశాలు
జపాన్
సమర్థవంతమైన, సురక్షితమైన రైలు వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన జపాన్.. ప్రమాదాలను నివారించడానికి వివిధ అధునాతన టెక్నాలజీలను అమలు చేస్తోంది. ఆ దేశ షింకన్ సేన్ బుల్లెట్ రైలులో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ ఉన్నాయి. ఈ రైలులో ఇప్పటి వరకు ఎలాంటి పొరపాట్లు జరగకపోవడం ప్రపంచ రికార్డు. అధునాతన ట్రాక్ తనిఖీ, నిర్వహణ పద్ధతులను అవలంబిస్తుంది. క్రమం తప్పకుండా తనిఖీ, నిర్వహణకు జపాన్ ప్రాధాన్యత ఇస్తుంది.
జర్మనీ
జర్మనీ కఠినమైన భద్రతా ప్రమాణాలకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర పెట్టుబడులకు ప్రసిద్ధి చెందింది. యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ఈటీసీఎస్)తో పాటు ఆ దేశం అనేక సమగ్ర రైలు నియంత్రణ వ్యవస్థలను అమలు చేసింది. ఇది వివిధ రైలు నెట్ వర్క్ లలో సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్ధారిస్తుంది. జర్మనీ కూడా ఉద్యోగుల శిక్షణకు బలమైన ప్రాధాన్యత ఇస్తుంది. క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్లను నిర్వహిస్తుంది.
దక్షిణ కొరియా
రైలు ప్రమాదాలను నివారించడంలో దక్షిణ కొరియా గణనీయమైన పురోగతి సాధించింది. ఈ దేశ రైలు వ్యవస్థలు ఆటోమేటిక్ ట్రాక్ ఇన్స్పెక్షన్ టెక్నాలజీలతో పాటు అధునాతన సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. దేశంలోని హైస్పీడ్ రైల్ నెట్ వర్క్ అద్భుతమైన భద్రతా రికార్డును కలిగి ఉంది. దీనినే కేటీఎక్స్ అంటారు.
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)
యునైటెడ్ కింగ్ డమ్ ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్ (ఏడబ్ల్యూఎస్), యూరోపియన్ రైల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఆర్టీఎంఎస్) వంటి అధునాతన రైలు రక్షణ వ్యవస్థలను అమలు చేస్తోంది. ఈ వ్యవస్థలు రియల్ టైమ్ అలర్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్ సామర్థ్యాలను అందిస్తాయి. దీని వల్ల ఘర్షణలు, పట్టాలు తప్పే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిపోతాయి.
రైలు ప్రమాదాలను నివారించడానికి అధునాతన సాంకేతికతలు, పటిష్టమైన నిర్వహణ, సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థల కలయిక అవసరం. అడ్వాన్స్ సిగ్నలింగ్, కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్స్, ఆటోమేటిక్ ట్రాక్ ఇన్స్పెక్షన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్ డమ్ వంటి దేశాలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంలో, ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యమివ్వడంలో విజయవంతమయ్యాయి. ఈ విజయగాథల నుండి పాఠాలు నేర్చుకోవడం వల్ల, వాటి కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశంలో కూడా సురక్షిత రైలు ప్రయాణాలు జరుగుతాయి.
COMMENTS