CENTRAL GOVERNMENT SCHEME 2022
ఈ పథకం మీకు తెలుసా..? విద్యకు అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే..
ఇంట్లో ఆడపిల్ల పుడితే... వారి విద్యకు అయ్యే ఖర్చును అంతా ఈ పథకం ద్వారా కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. 1997 అక్టోబర్ 2న బాలికా సమృద్ధి యోజన అనే పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.
కుమార్తెల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రారంభించిన ఈ పథకానికి దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న బాలికలు అర్హులు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న కుటుంబాలు ప్రయోజనాలను పొందుతారు.
అయితే ఈ పథకం ప్రతీ ఒక్కరికీ వర్తించదు. కేవలం 15 ఆగస్టు 1997 తర్వాత పుట్టిన ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఒక వేళ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే.. ఆ ఇద్దరికి కూడా ఈ ప్రయోజం చేకూరుతుంది. అంతే కాకుండా.. ఆడపిల్లకు జన్మనిచ్చిన సమయంలో తల్లికి రూ.500 ఆర్థిక సహాయం అందిస్తుంది.
ఆడపిల్లల చదువు కోసం ఏటా స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే పథకం ప్రయోజనం ఉంటుంది. కుమార్తెలు పెద్దవారైన తర్వాత మాత్రమే ఖాతా నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. మేజర్ కాక ముందే కుమార్తెకు వివాహం చేస్తే.. బాలికా సమృద్ధి యోజన కింద అనర్హులు అవుతారు.
బాలికా సమృద్ధి యోజనను సద్వినియోగం చేసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు తమ కుమార్తెలను ఏదైనా అంగన్వాడీ కేంద్రంలో చేర్చుకోవచ్చు. ఇక్కడ లబ్ధిదారుని కుటుంబానికి సంబంధించిన దరఖాస్తు పూర్తి చేస్తారు.
ఈ పథక ప్రయోజనం కొరకు ఆడపిల్ల జనన ధృవీకరణ పత్రం, తల్లి లేదా కుమార్తె బ్యాంక్ ఖాతా, అడ్రస్ కు సంబంధించిన ప్రూఫ్ అవసరం అవుతాయి. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె 18వ పుట్టినరోజున ఆమె అవివాహితురాలు అని గ్రామపంచాయతీ/మున్సిపాలిటీ నుండి సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత, మెచ్యూర్డ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునేందుకు అమలు చేసే ఏజెన్సీ బ్యాంకు లేదా పోస్టాఫీసు అధికారులకు అధికారం ఇస్తుంది.
స్కాలర్షిప్ ఎలా వస్తుందంటే.. 1-3వ తరగతి వరకు ఏడాదికి రూ.300 , 4వ తరగతిలో రూ.500 అందుతాయి. ఐదో తరగతిలో ప్రవేశం పొందితే రూ.600 అదుతుంది. 6-7 తరగతులకు రూ.700, 8లో రూ.800 అందుతాయి. 9-10 తరగతిలో ఆడపిల్లకు రూ.1000 స్కాలర్షిప్ అందజేస్తారు. 10వ తరగతి తర్వాత ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తుంది.
COMMENTS