Alert to parents.. Children who are addicted to social media.. Sensational facts in the latest survey..
తల్లిదండ్రులకు అలర్ట్.. సోషల్ మీడియాకు బానిసలవుతున్న చిన్నారులు.. తాజా సర్వేలో సంచలన వాస్తవాలు..
Children – social media: ఆధునిక కాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరుగుతోంది. చాలామంది దీనికి బానిసలుగా మారుతున్నారు. పెద్దలతోపాటు.. చిన్నారులు సైతం దీనికి అడిక్ట్ అవుతుండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. మహారాష్ట్రలో జరిపిన ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 9 నుంచి 13 సంవత్సరాల వయస్సున్న చిన్నారులు రోజులో 3 గంటలకంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని తేలింది. ఈ వాస్తవాన్ని వారి తల్లిదండ్రులే పేర్కొన్నట్లు అధ్యయనం తెలిపింది. మహారాష్ట్రలో జరిపిన ఈ సర్వేలో 42 శాతం అర్బన్ ఏరియా తల్లిదండ్రులు.. 9-13 సంవత్సరాల వయస్సు గల వారి పిల్లలు ఇంటర్నెట్లో వీడియోలు చూడటం లేదా ఆటలు ఆడటం కోసం సోషల్ మీడియాలో రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొన్నారు. 46 శాతం మంది.. వారి పిల్లలు పాఠశాల కార్యకలాపాలు ఆన్లైన్లో ఉన్నందున వాటిని సులభంగా యాక్సెస్ చేయడానికి స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు.
మహమ్మారి సమయంలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి వివిధ అధ్యయనాలను నిర్వహించే కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ అయిన లోకల్ సర్కిల్స్ ఈ సర్వేని నిర్వహించింది. మహమ్మారి తర్వాత ఇంటర్నెట్, సోషల్ మీడియా, పిల్లల గేమింగ్ అలవాట్లపై వారి పరిశీలనల కోసం జరిపిన ఈ అధ్యయనంలో మహారాష్ట్ర వ్యాప్తంగా సుమారు 13,000 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘‘మహమ్మారి మొదటి, రెండు సంవత్సరాలలో చాలా మంది పిల్లలు ఎక్కువగా వారి ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యక్తిగతంగా పాఠశాలలు మూసిఉన్న నేపథ్యంలో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యారు. దీంతోపాటు వీడియోలను చూడటానికి, ఆన్లైన్ గేమ్లు ఆడటానికి, తోటివారితో చాట్ చేయడానికి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు లేదా ల్యాప్టాప్ల వంటి గాడ్జెట్లను ఉపయోగించారు.. వారికి ఇష్టమైన కార్యకలాపాలలో ఇది ఒకటి. మహమ్మారి సమయంలో స్క్రీన్-టైమ్పై అబ్సెషన్ పెరిగిందని అధ్యయనాలు వెల్లడించాయి” అని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా అన్నారు.
కారణం అదేనట..
పిల్లలు సోషల్ మీడియా, వీడియోలు, ఇంటర్నెట్లో గేమింగ్లకు బానిసలుగా మారడానికి ప్రధాన కారణాలుగా తల్లిదండ్రులు గాడ్జెట్లను అధికంగా ఉపయోగించడం, పాఠశాల కార్యకలాపాలు ఆన్లైన్లో ఉండటం, దీనికనుగుణంగా పిల్లలకు ముందుగానే యాక్సెస్ ఇవ్వడం వంటి కారాణాలుగా భావిస్తున్నారు. 39 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు 9-13 సంవత్సరాల వయస్సు గల వారు ఇంటర్నెట్లో వీడియోలు, చాట్, గేమింగ్లకు బానిసలుగా మారారంటూ వెల్లడించారు. 35 శాతం మంది తల్లిదండ్రులు ఇది పాక్షికంగా నిజమని భావిస్తున్నారని సర్వే పేర్కొంది. తల్లిదండ్రుల ప్రకారం.. అనేక పాఠశాల సంబంధిత కార్యకలాపాలు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి.. ఇది ఇంటర్నెట్ను సులభంగా యాక్సెస్ చేయడానికి అనుమతించింది.
“పట్టణాల్లో నివసించే తల్లిదండ్రులు.. తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న తమ పిల్లలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో సహా ఇతర సోషల్ మీడియాను ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. ఇది అవాంఛనీయమైన కంటెంట్కు గురయ్యేలా చేస్తోంది” అని తపారియా అన్నారు. 65,000 మంది తల్లిదండ్రులతో జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో ఇలాంటి నిజాలు వెల్లడయ్యాయన్నారు. సర్వేలో పాల్గొన్న పట్టణ భారతీయ తల్లిదండ్రులలో 47 శాతం మంది తమ పిల్లలు 9-13 సంవత్సరాల వయస్సు గల వారు సోషల్ మీడియా, వీడియోలు మరియు ఇంటర్నెట్లో గేమింగ్కు బానిసలుగా ఉన్నారని చెప్పారు.
COMMENTS