When a family member passes away, what happens if you don't perform pooja for a year?
Devotional : కుటుంబం లోని వ్యక్తులు మరణించినప్పుడు ఏడాది పాటు పూజ చేయకుండా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.
ఇంట్లో వారు ఎవరైనా మరణించడం జరిగితే మరల వారి సంవత్సరీకం వచ్చేవరకు పూజలు, పండగలు వంటివి చేసుకోకూడదని,గుడికి ,పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదని అంటుంటారు.అంతవరకూ ఎందుకు ఇంటిలో నిత్యపూజా చేసుకునేవారు కూడా దీపం పెట్టకూడదు అని అంటుంటారు. అసలు ఇందులో ఉన్న నిజమెంత? పూజలు చేయకపోవడమే కాదు దేవత మూర్తులని ఒక వస్త్రం లో చుట్టేసి ఎక్కడో దూరం పెట్టేసి.. సంవత్సరీకాలన్నీ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని దేవత ప్రతిమల ను తీసి శుభ్రం చేసి పూజ పూజ మొదలు పెడతారు. అంటే ఒక వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధాన కానీ , పూజ కానీ , నివేదన తో సహా ఏవి ఉండవు.
ఇలా చేయడం అనేది అసలు మంచి పద్ధతి కాదు. మన శాస్త్రం లో ఇలాంటి పద్దతి ఎక్కడ చెప్పబడలేదు. ఇంకా చెప్పాలి అంటే మన సాంప్రదాయ ప్రకారందీపారాధన జరగని ఇల్లు స్మశానం తో సమానం అని అంటారు.ఎందుకంటే దీపం అనేది శుభానికి సూచిక. దీపం వెలిగే చోట దేవతలుకొలువై ఉంటారు. అందుకే ప్రతి ఇంట్లో నిత్యం దీపారాధాన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు దీపం పెట్టి దేవుణ్ణి పూజించడం వలన కొన్ని కొన్ని గండాలు కూడా తప్పుతాయి. మంచి జరుగుతుంది. ఎవరైన మరణించిన తర్వాత 11 వ రోజు తర్వాత శుద్ధి చేయడం తో పాటు 12 వ రోజు శుభస్వీకారం అనేది జరుగుతుంది. కాబట్టి కుటుంబం వారు ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు అని మాత్రమే శాస్త్రంలో చెప్పడం జరిగింది. కానీ సంవత్సరం పాటు ఇంట్లో దీపం వెలిగించడం, పూజలు చేయడం మానుకోమని చెప్పబడలేదు.
ఇంకా చెప్పాలి అంటే సమయంలో పూజతో పాటు సంధ్యావందనం కూడా చేయాలని, అర్ఘ్యప్రధానం వరకు శారీరకం గా చేసి మిగితాది మానసికంగా చేసుకోవాలి అని శాస్త్రం లో చెప్పబడింది. ఆ సంవత్సరం అంతా గుడికి వెళ్లద్దని కూడా ఎక్కడ చెప్పలేదు. మనంప్రతి రోజు అప్పటివరకు ఏదైతే చేస్తున్నామో ఎలాంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు. కాకపొతే కొత్తగా పూజలు అనేవి మొదలు పెట్టకూడదు. మీకు రోజూ గుడికి వెళ్లే అలవాటు ఉంటే 11 రోజుల తర్వాత కూడా మీరు గుడికి వెళ్ళవచ్చు.
ఏ కుటుంబంలోనైనా ఇంట్లో అందరికంటే పెద్దవారు పోతే మాత్రమే ఈ నియమాలు పాటించాలి.అదే ఇంట్లో పెద్దవారు ఉండగా వారికంటే చిన్న వారు మరణిస్తే మాత్రం అన్నీ 11 రోజుల తర్వాత గుళ్ళో నిద్రచేసి వచ్చిన అన్ని దైవిక కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చు.అంతే కాదు మనం ప్రతి రోజు చేసే పూజ వలన మనం పూజించే ప్రతిమల్లో దేవతలుకొలువై ఉంటారు. కాబట్టి ఏడాది పాటు వారికి ధూప, దీప, నైవేధ్యాలు వంటి ఉపచారాలు మానేసి, వస్త్రం లో చుట్టి పక్కన పెట్టడం అనేదిఅస్సలు మంచి పని కాదు అని గుర్తు పెట్టుకోండి. అలా చేయడం అనేది దోషమే కాదు అరిష్టము కూడా అని మరువకండి. ఇంటికి గానీ కుటుంబం లోని వారికి కానీ ఏ దోషాలున్నా వాటిని అన్నిటిని నివారించే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు కచ్చితం గా ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరు మరణించిన పూజలు మాత్రం ఆపకండి అని చెప్పక తప్పదు.మీకు ఈ విషయంలో ధర్మ సందేహాలుంటే మీకుదగ్గర లో ఉన్న శాస్త్రం బాగా తెలిసిన పండితులను అడిగి తెలుసుకోండి కానీ పూజలు మాత్రం మానకండి.
COMMENTS