RuPay Credit Card: Good news for RuPay credit card holders... those charges are gone
RuPay Credit Card: రూపే క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఆ ఛార్జీలు లేవు
RuPay Credit Card : రూపే క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గుడ్ న్యూస్ చెప్పింది. యూపీఐ పేమెంట్స్కి ఉపయోగిస్తే రూ.2,000 వరకు లావాదేవీలపై ఛార్జీలు లేవని తెలిపింది.
రూపే క్రెడిట్ కార్డుతో(RuPay Credit Card) యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు చేస్తే రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యూపీఐకి రూపేక్రెడిట్ కార్డుల్ని లింక్ చేయడానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రూపే క్రెడిట్ కార్డులు నాలుగేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. ప్రధాన బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డుల్ని జారీ చేస్తున్నాయి. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డుల్ని యూపీఐకి లింక్ చేయడం వల్ల క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. దీని వల్ల వ్యాపారులు కూడా లాభపడతారు.
క్రెడిట్ కార్డులు వర్చువల్ పేమెంట్ అడ్రస్కు లింక్ అవుతాయి. ఏటీఎం కార్డ్ ఉన్నవారు యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తున్నారో, క్రెడిట్ కార్డ్ ఉన్నవారు కూడా తమ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. ఈ లావాదేవీలకు రూ.2,000 వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని తాజాగా NPCI స్పష్టం చేసింది.
యూపీఐ యాప్స్లోనే క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్ కోసం సెట్టింగ్స్ ఉంటాయి. కస్టమర్ల సమ్మతితోనే క్రెడిట్ కార్డ్ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది. యూపీఐ పిన్ సెట్టింగ్ కూడా ఉంటుంది. అన్ని రకాల లావాదేవీలకు కస్టమర్ల సమ్మతి తప్పనిసరి. రూ.2,000 లేదా అంతకన్నా తక్కువ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ వర్తించదు. అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. దీని వల్ల తక్కువ మొత్తంలో లావాదేవీలు చేసే కస్టమర్లకు, చిరు వ్యాపారులకు మేలు జరుగుతుంది.
సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ను వ్యాపారులు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు లావాదేవీల మొత్తాన్ని బట్టి 1 నుంచి 2 శాతం మధ్య ఉంటుంది. అయితే ఈ ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తుంటారు వ్యాపారులు. యూపీఐ యాప్స్కి క్రెడిట్ కార్డ్స్ లింక్ చేయడం వల్ల క్రెడిట్ కార్డులు ఉన్నవారు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. తమ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ నుంచి ఆ డబ్బులు డెబిట్ అవుతాయి. క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ మొత్తం చెల్లించాలి.
ఇక రూపే డెబిట్ కార్డులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఛార్జీలు లేవు. ఇప్పుడు యూపీఐకి డెబిట్ కార్డులు లింక్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డుల్ని కూడా యూపీఐకి లింక్ చేయడం వల్ల కస్టమర్లకు పేమెంట్స్ చేయడానికి, వ్యాపారులకు పేమెంట్స్ స్వీకరించడానికి మరిన్ని ఆప్షన్స్ అందుబాటులోకి వస్తాయి.
డిజిటల్ రీటైల్ లావాదేవీల్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి. సెప్టెంబర్లో 6780 మిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.11 లక్షల కోట్లు.
COMMENTS