Gurajada Apparao Biography
తెలుగు రచయిత మరియు గొప్ప సాహితీవేత్త అయిన గురజాడ అప్పారావు గురించి దాదాపుగా తెలియని తెలుగు వారు ఉండరు అనే చెప్పాలి. ఆయన రాసిన కన్యాశుల్కం నాటకం అలానే అందులోని గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు పాత్రలు ఎంతగా ప్రఖ్యాతి పొందాయో అందరికీ తెలిసిందే. ఇక సామజిక అంశాల ద్వారా సాంఘిక పరివర్తనకు తనవంతుగా ఎంతో కృషి చేసిన గురజాడ అప్పారావు గారి బయోగ్రఫీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరంలో తన మేనమామ ఇంట్లో 21 సెప్టెంబర్ 1862లో వెంకట రామదాసు కౌసల్యమ్మ దంపతులకు గురజాడ అప్పారావు జన్మించారు. ఆయన తండ్రి అప్పటి విజయనగర సంస్థానంలో రెవెన్యూ సూపర్ వైజర్ గాను అలానే ఖిలాదారు గాను కొన్నాళ్ళు పనిచేయడం జరిగింది. పదవ ఏట వరకు చీపురుపల్లిలో చదువుకున్న గురజాడ ఆ తరువాత తండ్రి మరణాంతరం విజయనగరానికి చేరారు.
అనంతరం తమ ఆర్ధిక పరిస్థితి బాగోలేని కారణంగా కొన్నాళ్ల పాటు వారాలు చేసుకుని చదువు కొనసాగిస్తుండగా అప్పటి ఎం. ఆర్. కాలేజీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర శాస్త్రి గురజాడ మంచితనాన్ని చూసి చేరదీసి ఆదుకున్నారు. 1882లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన గురజాడ ఆపై 1884లో ఎఫ్. ఏ. పూర్తి చేసారు. ఆ తరువాత బీఏ చదువుతూ ఎం ఆర్ హైస్కూల్ టీచరుగా పనిచేసిన గురజాడ అప్పటి ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి సహాధ్యాయి మరియు ఇద్దరూ మంచి ప్రాణస్నేహితులు కూడా.
1885లో అప్పల నరసమ్మని వివాహం చేసుకున్నారు గురజాడ. 1887లో మొదటి కుమార్తె ఓలేటి లక్ష్మి నరసమ్మ, 1890లో కుమారుడు వెంకట రామదాసు, అలానే 1902లో పులిగడ్డ కొండయ్యమ్మ లు వారికి జన్మించారు. అప్పటి విజయనగర సంస్థాన పూసపాటి గజపతిరాజులతో మంచి సంబంధాలు కలిగిన గురజాడ 1887లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సభలో ప్రసంగించారు. 1889లో ఆనంద గజపతుల డిబేటింగ్ క్లబ్ కి ఉపాదాధ్యక్షుడిగా ఎన్నికైన గురజాడ అనంతరం తమ్ముడు శ్యామల రావు తో కలిసి ఆంగ్లంలో పలు పద్యాలు కూడా రాశారు. అప్పట్లో వారు రాసిన సారంగధర, ఇండియన్ లీషర్ అవర్ అనే ఆంగ్ల పద్యాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.
ఆపై 1891లో విజయనగర సంస్థానంలో శాసన పరిశోధకునిగా పని నియమింపబడ్డ గురజాడ అప్పారావు, 1897లో మహారాజ ఆనంద గజపతి మరణించడంతో అప్పటి రీవా మహారాణి అప్పల కొందమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా కూడా నియమితులయ్యారు. ఇక అనంతరం గిడుగు రామమూర్తితో కలిసి తెలుగు వాడుక భాషకు మరింత ప్రాచుర్యం అందించేందుకు అప్పట్లో ఎంతో పేరెన్నికగన్న కన్యాశుల్కం నాటకాన్ని 1890లో వాడుక భాషలో రచన చేసి వేశ్య వృత్తి అలానే సామజిక దురాగతాలపై విమర్శనాస్త్రంగా దానిని సంధించి అందరి నుండి మెప్పు పొందారు.
అయితే అప్పట్లో వాడుక భాష వ్యతిరేకి అయిన కాశిభట్ట బ్రహ్మయ్య శాస్త్రి ఈ నాటకం యొక్క సాహితీ విలువలకు మెచ్చి గురజాడకు ఎంతో ప్రశంశలతో ముంచెత్తారు. ఇక 1910లో గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే దేశభక్తి గీతం ఎంతో గొప్ప పేరు దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంది. ఇక 1911లో మద్రాసు విశ్వవిద్యాలయ బోర్డు ఆఫ్ స్టడీస్ లో నియమితులయిన గురజాడ ఆపై తన స్నేహితులతో కలిసి ఆంధ్ర సాహిత్యపరిషత్తుని స్థాపించారు.
20వ శతాబ్దం తొలి రోజుల్లో వ్యావహారిక తెలుగు భాషోద్యమంలో గిడుగు రామమూర్తితో కలిసి గురజాడ చేసిన పోరాటం అలానే పలు పత్రికలు, సభలు, సమావేశాల్లో పలు ప్రసంగాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. గిడుగు రామమూర్తి వాదనా బలం ఒకవైపు గురజాడ వ్యావహారిక భాషా శైలి మరొకవైపు అప్పట్లో వ్యావహారిక భాషోద్యమానికి ఎంతో గొప్ప పునాదులు వేసాయి.
కాగా అనంతరం 1913లో పదవీ విరమణ చేసిన అప్పారావు, అప్పటి నుండి అనారోగ్యంతో బాధపడసాగారు. అయితే అదేసమయంలో ఆయనకు మద్రాసు విశ్వవిద్యాలయం వారు ఫెలో బిరుదుతో గౌరవించారు. ఇక దాని అనంతర కాలంలో ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో చివరికి తన 53వ ఏట 1915, నవంబర్ 30న గురజాడ అప్పారావు తుది శ్వాస విడిచారు. నిజానికి గురజాడ మన మధ్య లేనప్పటికీ వాడుక భాష కోసం ఆయన చేసిన కృషి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఆయన పడ్డ తపన తద్వారా దక్కించుకున్న పేరు ఎప్పటికీ మన తెలుగు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతాయి అని చెప్పవచ్చు ….. !!
COMMENTS