Digital University: డిజిటల్ యూనివర్సిటీ అంటే ఏంటి? దీనికి ఎలా అప్లై చేసుకోవాలి..? యూజీసీ చైర్మన్ వివరణ..
ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2022 (NEP-2022) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మల్టిపుల్ ఎగ్జిట్ పాయింట్స్, క్రెడిట్ స్కోర్ వంటి వాటిని అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అమలు చేయనున్నారు. అలాగే విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ యూనివర్సిటీ (Digital University)ని తీసుకురానున్నారు. ఇది వచ్చే ఏడాది ఆగస్టు ఆగస్టు నుంచి పనిచేయనుంది. కాగా, 2022-23 బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) డిజిటల్ యూనివర్సిటీని ప్రకటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ యూనివర్సిటీ విధివిధానాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించనుంది. డిజిటల్ యూనివర్సిటీ అందించే స్కిల్ కోర్సులను 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులు యాక్సెస్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఎంచుకునే కోర్సులు పూర్తి చేసిన తర్వాత సంబంధిత సర్టిఫికెట్స్, డిప్లొమా, డిగ్రీ పట్టాలు అందుకోనున్నారు. డిజిటల్ యూనివర్సిటీ పనితీరు, సంబంధిత వివరాలను యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీష్ కుమార్ వెల్లడించారు. దీని ప్రత్యేకతలు తెలుసుకుందాం.
కీలక ఒప్పందం..
దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సైతం ఈ స్కిల్ బేస్డ్ కోర్సులను అందించనున్నారు. ఇందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో యూజీసీ ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ డివైజెస్ సౌకర్యం లేని విద్యార్థుల కోసం డిజిటల్ యూనివర్సిటీ కామన్ సర్వీస్ సెంటర్స్(CSCs), స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVs)ను వినియోగించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు లక్షల సీఎస్సీలు, ఎస్పీవీలు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇ- సమాధాన్ పోర్టల్ సింగిల్ విండోగా పనిచేయనుంది. విద్యార్థుల సమస్యలు గరిష్టంగా 10 రోజుల్లో పరిష్కారం కానున్నాయి. టీచింగ్, నాన్ టీచింగ్ సమస్యలను 15 రోజుల్లో, యూనివర్సిటీ, కాలేజీలకు సంబంధించిన సమస్యలను 20 రోజుల్లోగా పరిష్కరిస్తామని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. మెయిల్ ఐడీ సహాయంతో లేదా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయడం ద్వారా కూడా బాధితులు తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
నేర్చుకోవడానికి అవకాశాలు
ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ (POP) విధానం ప్రకారం.. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, పరిశ్రమ నిపుణుల మధ్య డిజిటల్ యూనివర్సిటీ అనుసంధానకర్తగా ఉండనుంది. దీంతో అభ్యర్థులు పరిశ్రమ నుంచి ఎంతో నేర్చుకోనున్నారు. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో భాగంగా ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులు విద్యార్థులకు నాలెడ్జ్ను అందించనున్నారు.
ఇ-సమాధాన్ పోర్టల్
ఆన్లైన్ కోర్సుల సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి యూజీసీ ఇ-సమాధాన్ పోర్టల్ను ప్రారంభించినట్లు జగదీష్ కుమార్ తెలిపారు. ఇ-సమాధాన్ పోర్టల్ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇది 24 గంటలు పాటు సేవలను అందిస్తుంది.
COMMENTS