Raksha Bandhan : రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్
Rakhi Purnima : రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటూరు.
రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే
పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.
రాఖీపౌర్ణమి చరిత్ర:
– ద్రౌపది – శ్రీకృష్ణుని బంధం
అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.
శ్రీ మహావిష్ణువు.
బలిచక్రవర్తి-
సోదరుడు-రక్షా బంధన్
శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ ” యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల” భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)
అలెగ్జాండర్ భార్య – పురుషోత్తముడి కథ
చరిత్రపుటల్లో అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ ) కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు.
జైనుల నర్లీ పూర్ణమి
శ్రావణ పూర్ణిమను జైన మతస్తులు ‘నర్లీపూర్ణ’మిగా నిర్వహిస్తారు. సముద్ర, నదీజలాల్లో కొబ్బరికాయల్ని జారవిడిచి ఈ సంవత్సరమంతా నీరు సమృధ్ధిగా కొనసాగాలని కోరుకుంటారు. ఐశ్వర్య కారకుడైన ఈశ్వరుడు, మహాలక్ష్మిని ధనాధిష్ఠాన దేవతగా శ్రావణ పౌర్ణమినాడే నియమించాడని రుద్రసంహిత పేర్కొంది. సృష్టికర్త బ్రహ్మ శారదాదేవిని విజ్ఞాన ఘన రూపిణిగా ఈ పౌర్ణమినాడే పట్టం కట్టాడని శ్రీవిద్యాసూక్తం వివరించింది. వేదాల్ని అపహరించిన సోమకాసురుణ్ని, వధించడానికి హయగ్రీవుడిగా శ్రీహరి అవతరించింది శ్రావణపూర్ణిమ నాడేనంటారు. శివసంకల్ప శక్తితో దేవ భాషగా ప్రస్తావించే సంస్కృతం శ్రావణపౌర్ణమి రోజున సాకారమైందని రుగ్వేదం వెల్లడించింది.
హయగ్రీవావతారం
శ్రీ మహావిష్ణువు విజయగాథా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు.
శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు.
బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్ధ(ఆర్.ఎస్.ఎస్) సంస్థాగత స్థాయిలో అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. విజయదశిమి, మకర సంక్రాంతి, ఉగాది, గురుపూర్ణిమ, హిందూ సామ్రాజ్య దినోత్సవం, ఇతర ఐదు పండుగలుగా ఉన్నాయి
‘హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముంచంతి పాపాని దరిద్ర మివయోషితః
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్న కన్యా ప్రవాహవత్
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతేచ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః!!
ఫలశ్రుతిః
శ్లోకత్రయమిదం దివ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదప్రదం!!
హయగ్రీవ హయగ్రీవ
అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది.
హయగ్రీవ హయగ్రీవ.. అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చదువు వస్తుంది…అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట…హయగ్రీవ హయగ్రీవ..అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠం యొక్క తలుపులు తెరుచు కుంటాయి…అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది…హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి…ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి…జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవ మూర్తి స్తుతి చేసిన వారికి సర్వ విద్యా బుద్ధులూ లభిస్తాయి. విద్య ఉన్నచోట అడగ కుండానే అష్ట లక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవ జీవితానికి సర్వసుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం.
మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే…
ఉపాసనాపరంగా మానవ,
జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు
శీఘ్ర అనుగ్రహ ప్రదాతలు.
అటువంటి దైవాల్లో
శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు.
హయగ్రీవుని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వ విద్యలూ కరలామలక మవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.
విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం!
విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
దయానిధిం దేవభృతాం శరణ్యం!
దేవం హయగ్రీవ మహం ప్రపద్యే!!
COMMENTS