పాల నురగల ప్రకృతి దృశ్యం.. దూద్ సాగర్ జలపాతం
వర్షాకాలంలో ఆకాశపు అంచునుంచి పాలకడలి నురుగలు కక్కుతూ జాలువారుతుందా అనేలా దర్శనమిస్తుంది దూద్ సాగర్ జలపాతం సుందర దృశ్యం చూసిన క్షణంలో ఈ పాల సముద్రం నిజంగా భూలోకంలోనే ఉందా అని ఆశ్చర్యానికి గురికాకతప్పదు. హైదరాబాద్ నుంచి గోవా వెళ్తుంటే ఎడమ వైపున దర్శనం ఇస్తుంది దూద్ సాగర్ వాటర్ ఫాల్స్.
ఈ జలపాతాన్ని తనివితీరా ఆస్వాదించనిదే.. గోవా పర్యటన పూర్తికాదంటే నమ్మండి. ఇది పర్యాటకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇది పనాజీకి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
రైల్లో నుంచి చూస్తే అచ్చంగా పాల కడలిలా కనిపిస్తుంది. అందుకే దీన్ని దూద్ సాగర్ అని పిలుస్తారు. దేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులున్న జలపాతాల్లో ఇది ఒకటి. 310 అడుగుల ఎత్తు నుంచి దుకూతుంది జలపాతం. మరిన్ని దూద్ సాగర్ విశేషాలను చూద్దాం.
నీటి తుంపరుల కేరింతలు..
గోవా, కర్ణాటక సరిహద్దు మన్డోవి నదిపైన ఉంది దూద్ సాగర్ జలపాతం. పైనుంచి జాలువారే నీరు పాలలా కనిపిస్తాయి. అందుకే దీనిని పాలసాగర జలపాతం అని కూడా పిలుస్తారు. ఈ జలపాతం పారుతున్న కొండల మధ్య నుంచి రైల్ ట్రాక్ ఉంది. దానిపై ప్రయాణం చేస్తూ జలపాతపు అందాలను కనులారా చూడాలి. తుల్లిపడే చల్లని నీటి తుంపరులు రైలు కిటికీలను దాటకుంటూ మనల్ని తాకుతుంటే ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే.
దాదాపు 310 మీటర్ల (1017 అడుగులు) ఎత్తు ఉన్న కొండల నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. చాలా సినిమాల్లో ఈ సుందర దృశ్యం దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన జలపాతంగా పేరొందిన ఈ ఇక్కడి జలపాత పరిసర ప్రాంతాలు గోవా అటవీశాఖ పరిధిలో ఉంటాయి. ఈ సీజన్లో జలపాతానికి సంబంధించిన దారిని మూసివేస్తారు. మళ్లీ అక్టోబర్ నెలలో తెరవబడుతుంది.
ప్రకృతి నడుమ ప్రయాణం..
నిటారుగా ఉండే ఈ కొండపైకి ట్రెక్కింగ్కు ఈ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, జీప్ సఫారీ కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తంపైకి చేరుకునేందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి. అత్యంత సాహసోపేతమైన ట్రెక్ కువేషి గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. మన్డోవి నదిని దాటాల్సి ఉన్నందున వర్షాకాలంలో ఇక్కడికి అనుమతి ఉండదు. దట్టమైన అడవి గుండా పది కిలోమీటర్ల పొడవైన మార్గంలో వెళ్లవలసి ఉంటుంది. వర్షాకాలంలో కాజిల్ రైల్వే స్టేషన్ నుంచి జలపాతం వరకూ ట్రెక్కింగ్ చాలా ప్రసిద్ధి చెందింది. దాదాపు 14 కిలోమీటర్ల పొడవులో అద్భుతమైన లోయల అందాల నడుమ సాగుతుంది.
కొలెం లేదా కుల్హెం రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే మూడవ కాలిబాట దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుంది. అయితే, ఈ మార్గం కాజిల్ రాక్ నుంచి వచ్చే మార్గమంత ప్రజాదరణ పొందలేదు. జలపాతం చేరుకునేందుకు సులువైన మార్గం టాక్సీ స్టాండ్లో వాహనం తీసుకుని, డ్రాపింగ్ పాయింట్ నుంచి కిలోమీటర్ దూరం వెళ్లడం. కుటుంబ సమేతంగా సందర్శనకు వచ్చేవారు ఈ మార్గాన్ని ఇష్టపడతారు.
ఎలా చేరుకోవాలి?
జలపాతానికి చేరుకోవాలంటే గోవా రాజధాని పనాజి నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. లేదంటే రైలు ద్వారా కూడా వెళ్లొచ్చు. మాడ్గావన్ రైల్వే స్టేషన్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదా బెల్గాం రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెల్గాం నుంచి రోడ్డు ద్వారా వెళ్లాలంటే 55 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. జలపాతం చుట్టుపక్కల దుకాణాలు ఉండవు. కాబట్టి సందర్శకులు అవకాశం
***ఉన్నంతవరకూ మంచినీళ్లతోపాటు ఆహారం కూడా తీసుకువెళ్లడం ఉత్తమం.
COMMENTS