పచ్చని పర్యాటక గొడుగు.. పిల్లలమర్రి
పిల్లల మర్రి పరిసరాల్లో ఎటు చూసినా పచ్చదనంతో నిండిన వాతావరణమే దర్శనమిస్తుంది. జలపాతం నుంచి జాలువారే దారల మాదిరి ఓ పెద్ద వృక్షంను వేళ్లాడే ఊడలు వయసు సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్రంలో చూడదగ్గ టూరిజమ్ స్పాట్లలో ఒకటిగా స్థానం సంపాదించింది. ఏ స్థానం అంత సులువుగా వచ్చేయలేదండోయ్.
ఈ అద్భుతమైన పిల్లల మర్రిని పాలమూరుకు నాలుగు కిలో మీటర్ల దూరంలో చూడవచ్చు. దీన్ని చూడటానికి దూర ప్రాంతాల నుంచి చాలా మంది యాత్రికులు వస్తుంటారు. కుటుంబ సమేతంగా విహరించేందుకు ఈ ప్రాంతం కేరాఫ్ అడ్రస్గా చెప్పుకొవచ్చు. అక్కడి మరిన్ని విశేషాలు మీకోసం..!
తెలంగాణలోని పాలమూరు పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైనది పిల్లల మర్రి. మనదేశంలోని మూడవ అతి పెద్ద పరిమాణం గల వృక్షంగా ఈ మర్రిని చెప్పుకోవచ్చు. ఈ వృక్షానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు చెబుతారు. దూరం నుంచి చూస్తే దట్టమైన చెట్లతో నిండి ఉన్న చిన్న కొండలా, గుబురుగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. దగ్గరకి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో పాఠశాల, కళాశాలల విద్యార్థులు ఎక్కువగా సందర్శిస్తారు. అలాగే పిల్లల మర్రి చెట్టు పక్కనే జింకలపార్కు. మ్యూజియం, ఆక్వేరియం ఉన్నాయి. వర్షా కాలంలో అయితే చక్కగా షికారూ చేయవచ్చు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం వల్ల అవసరమైన సౌకర్యాలు కల్పించారు. కుటుంబ సమేతంగా వెళ్లేవారు సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని సందర్శించవచ్చు.
చారిత్రక శిల్ప సంపద..
మరీ ముఖ్యంగా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటస్థలం ఎంతో అందంగా తీర్చిదిద్దారు. వారికి అవసరమైన ఆట వస్తువులుకూడా ఇక్కడ చూడొచ్చు. కేరింతలు కొడుతూ పిల్లలు చేసే అల్లరికి కేంద్రంగా అనిపిస్తుంది ఈ ఆటస్థలం. దీనిని ఆనుకుని ఉన్న పురావస్తు మ్యూజియం, మినీ జూపార్క్ ఆకట్టుకొంటున్నాయి. ఇక్కడి మ్యూజియంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను ఉంచారు. వివిధ కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, పురాతన కాలంలో మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో పొందుపర్చారు. అలాగే క్రీ.శ ఏడవ శతాబ్ది వరకు ఉన్న నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలు చాలా ఉన్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మధ్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలిక్కడ దర్శనమిస్తాయి. ఈ మ్యూజియంలో ఉన్నంత సేపూ టైమే తెలియదు. చారిత్రక సంపదను కల్లారా చూడాలనేవారు మ్యూజియంలో అడుగుపెట్టాల్సిందే.
కనులారా చూడాల్సిందే..
ఇక్కడికి విహార యాత్రకు వచ్చే వారు మినీ జూపార్క్ను కచ్చితంగా సందర్శించాల్సిందే. అక్కడ రకరకాల పక్షులు, నెమళ్లు, కుందేళ్లు, కోతులు, అక్వేరియంలో కనిపించే చేపలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. పచ్చదనంతో కూడిన చెట్లమధ్య ఏర్పాటు చేసిన ఈ అందాలను మనసారా ఆస్వాదించాలనే కనులారా చూడాల్సిందే. ఎక్కడ చూసినా పర్యాటకులు సెల్ఫీల హడావిడితో కనువిందు చేస్తూ కనిపిస్తారు. పూరావస్తుశాఖ, అటవీశాఖధికారులు పిల్లలమర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు. ఇక్కడి మ్యూజియంను పురావస్తుశాఖవారే ఏర్పాటు చేశారు. సందర్శకులకు అవసరమైన ఆల్పాహారంతోపాటు, వివిధ తినుబండారాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
COMMENTS