ఏపీలో అగ్యుమెంటెడ్ రియాలిటీ తరహా టెక్నాలజీ మ్యూజియమేదో తెలుసా?
బాపూ మ్యూజియం.. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఓ చారిత్రక నిలయం. ఇక్కడి ప్రతి శిల్పం తనను తాను పరిచయం చేసుకునేలా రూపొందించిన ఆధునికీకరణకు కేరాఫ్ అడ్రస్. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే సగటు నగర జీవికి.. కుటుంబ సమేతంగా వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించేందుకు బెజవాడ వేదికగా పరిచయమైన ఓ చారిత్రక కట్టడం.
అగ్యుమెంటెడ్ రియాలిటీ తరహా టెక్నాలజీ జాతీయ స్థాయిలో మ్యూజియాల్లో మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో అలాంటి తరహా టెక్నాలజీని ఏర్పాటు చేయించుకున్న తొలి మ్యూజియం ఇదే.
రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉన్న బాపూ మ్యూజియం అట్టహాసంగా పునః ప్రారంభమైంది. ఆదిమ మానవు చరిత్రకు సాక్షిగా నిలిచే పురాతన వస్తువులు, శిల్పకళ సంపదతోపాటు ఆధునిక హంగులతో మ్యూజియాన్ని తీర్చిదిద్దారు. పదిలక్షల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచే అరుదైన 1500 రకాల వస్తువులను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మొత్తం పురావస్తు సంపద ఏడు గ్యాలరీల్లో, డిజిటలైజేషన్తో కొత్తరూపును సంతరించుకుంది. ప్రభుత్వం రాజధాని కేంద్రంగా ఒక మ్యూజియం ఉండాలన్న ఉద్దేశంతో దీనికి రాష్ట్ర హోదాను కల్పించింది. అగ్యుమెంటెడ్ రియాలిటీలో చరిత్రమ్యూజియంలో ఉన్న వస్తువులు, శిల్పాలకు ఒక్కో ఘనచరిత్ర ఉంది.
దానిని సందర్శకులకు శ్రవణరూపంలో అందించడానికి అగ్యుమెంటెడ్ రియాలిటీని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులు బాపు మ్యూజియం పేరుతో ఒక యాప్ను తయారు చేశారు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్లో ఉంచారు. ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం ఉచితంగా వైఫై సదుపాయాన్ని కల్పించారు. మ్యూజియాన్ని సందర్శించడానికి వచ్చేవారు కచ్చితంగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
అరకులో ఉన్న అనుభూతి..
ప్రతి గ్యాలరీలో ఉన్న వస్తువులు, శిల్పాలకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. మ్యూజియం యాప్ను తెరిచి కోడ్ను స్కాన్ చేయగానే, ఆ శిల్పం లేక వస్తువు చరిత్ర రెండు, మూడు నిమిషాల పాటు ఆడియో రూపంలో వినిపిస్తుంది. ఆ వస్తువు గానీ, శిల్పం గానీ ఏ రూపంలో ఉంది, ఏయే ఆకారాలు ఉన్నాయో సందర్శకులకు తెలియజేస్తుంది. ఈ తరహా అగ్యుమెంటెడ్ రియాలిటీ జాతీయ స్థాయిలో మ్యూజియాల్లో మాత్రమే ఉంటుంది. రాష్ట్రంలో ఈ తరహా టెక్నాలజీని ఏర్పాటు చేయించుకున్న తొలి మ్యూజియం ఇదే.
ప్రస్తుత మ్యూజియం భవనానికి చెంతనే సరికొత్త భవనాన్ని నిర్మించారు. దీని పైఅంతస్తులో మొత్తం రెండు గ్యాలరీలు ఉంటాయి. ఇందులో ఒకటి వర్చువల్ రియాలిటీ గ్యాలరీ. ఇక్కడ అరకుతో పాటు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలను పోలిన గ్రీన్మ్యాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన సందర్శకులకు ప్రత్యేకంగా కళ్లజోడు ఇస్తారు. దాన్ని పెట్టుకుని చూస్తే సందర్శకుడు బాపు మ్యూజియంలో ఉన్నా అరకులో ఉన్న అనుభూతిని పొందుతాడు. దీనికి చెంతనే 30-40 మంది కూర్చునేలా ఏవీ రూమ్ను నిర్మించారు.
వినోదంతోపాటు విజ్ఞానం..
మ్యూజియం ప్రారంభించినప్పటినుంచి సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సెలవు రోజుల్లో కుటుంబసమేతంగా వచ్చే సందర్శకులతో ఎంతో ఆహ్లదకరంగా దర్శనమిస్తుంది ఈ మ్యూజియం. మ్యూజియంలో అగ్యుమెంటెడ్ రియాలిటీ సాంకేతికతను జోడించడంతో టికెట్ ధరను రూ.50గా నిర్ణయించారు. మ్యూజియం పరిసరాల్లో వస్త్ర ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. దీంతోపాటు నిత్యం ఏదో ఒక ప్రదర్శనకు ఖాళీ ప్రాంగణాన్ని అద్దెకు ఇస్తూ ఉంటారు.
మ్యూజియం ప్రత్యేకతలను పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగితే వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించేందుకు దోహదపడుతుందని నగరవాసులు భావిస్తున్నారు. ఆది మానవుల నుంచి ఆదునిక యుగం వరకూ పొందుపరచిన పురాతన సంపద గూర్చి భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది కదా! మరెందుకు ఆలస్యం మీరూ బాపు మ్యూజియంలో అడుగుపెట్టండి.
COMMENTS