Post Office Schemes: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? కొత్త రూల్స్ తెలుసుకుందాం..
Post Office Schemes: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? అందులో ఏదైనా స్కీంలో జాయిన్ అయ్యారా.? అయితే ఇది మీ కోసమే. ఇకపై పోస్టాఫీసు పథకాల నుండి డబ్బులు ఉపసంహరణ రూ. 20 లక్షలకు మించితే టీడీఎస్ తగ్గింపు కోసం ఇండియన్ పోస్ట్ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనలు పీపీఎఫ్ ఉపసంహరణలకు కూడా వర్తిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 194N ప్రకారం సవరించిన నిబంధనలకు అనుగుణంగా, గడిచిన మూడు అసెస్మెంట్ సంవత్సరాలకు గానూ పెట్టుబడిదారుడు ఆదాయపు పన్ను రిటర్న్స్ను (ఐటిఆర్) దాఖలు చేయకపోతే, అప్పుడు ఉపసంహరణ మొత్తం నుంచి టీడీఎస్ను కట్ చేయాల్సి ఉంటుంది.
పోస్ట్ ఆఫీస్, పీపీఎఫ్ టీడీఎస్ రూల్స్….
కొత్త రూల్స్ ప్రకారం, ఓ ఆర్ధిక సంవత్సరంలో పెట్టుబడిదారుడి నగదు ఉపసంహరణ రూ. 20 లక్షలు దాటి.. రూ. 1 కోటి మించకపోతే.. అప్పుడు రెండు శాతం చొప్పున టీడీఎస్ను రూ. 20 లక్షలు దాటిన మొత్తానికి చెల్లించాల్సి వస్తుంది. ఇక ఈ కొత్త నిబంధన 2021, జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది.
ఒకవేళ అన్ని పోస్టాఫీసు ఖాతాల నుండి విత్ డ్రా చేసిన నగదు.. ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 కోటి దాటితే, అప్పుడు 5 శాతం చొప్పున టీడీఎస్ను రూ. 1 కోటి దాటిన మొత్తానికి చెల్లించాలి.
ఇదిలా ఉంటే మీరు ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తుంటే.. ఆర్ధిక సంవత్సరంలో పోస్టాఫీసు స్కీంల నుంచి ఉపసంహరించే మొత్తం రూ. 1 కోటి దాటితే.. పరిధి దాటిన నగదుకు రెండు శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
టీడీఎస్ను సవరించడంలో పోస్టాఫీసులను సులభతరం చేయడానికి.. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ (సిఈపిటి) 2020 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31 వరకు మధ్య కాలంలోని డిపాజిటర్ల వివరాలను సేకరించింది. ఖాతాదారుడి పాన్ నెంబర్, టీడీఎస్ రూపంలో కట్ చేయాల్సిన నగదు వివరాలను సిఈపిటి అందించింది.
COMMENTS