Pomegranate : దానిమ్మ రైతులను కలవరపెడుతున్న బ్యాక్టీరియా మచ్చ వ్యాధి
Pomegranate : ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల రైతులు దానిమ్మ పంటను వాణిజ్యపరంగా సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ప్రయోజకారి కావటంతో ఈ పండును తినమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దానిమ్మకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఒక్కసారి పొలంలో దానిమ్మ పంట వేస్తే కాపుకు వచ్చేందుకు మూడేళ్ళ సమయం పడుతుండగా, ఆతర్వాత 30 ఏళ్ళ వరకు కాపు వస్తుంది. దానిమ్మ పండు పైన తోలు, రసం, ఆకులు, వేర్లను ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తున్నారు.
దానిమ్మ సాగు చేపట్టే రైతులు కొన్ని మెళుకువలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంది. దానిమ్మ పంట వేసిన రైతులు ప్రధానంగా ప్రాణాంతక బ్యాక్టీరియా మచ్చ వ్యాధి సమస్యతో పంటను కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీని నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ బ్యాక్టీరియా మచ్చ ప్రధానంగా క్శాంతోమోనాస్ ఆక్సోనోపోడిస్ బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఆశిస్తే దానిమ్మ పండ్ల దిగుబడి, నాణ్యతను కోల్పోయి మార్కెట్లో కాయకు విలువపడిపోతుంది.
ఈ బ్యాక్టిరియాను గుర్తించటం చాలా శులభం. ఆకులపై పసుపు వలయాల చుట్టూ గోధుమ రంగు వృత్తాకార మచ్చలు కనిపిస్తే పంటను ఈ బ్యాక్టీరియా ఆశించిందని గుర్తించాలి. ఆకులు క్రమేపి పసుపు రంగులోకి మారిపోయి రాలిపోతుంటాయి. వ్యాధి పూవులకు కూడా సోకుతుంది, వ్యాధి వ్యాపించడం వల్ల పూతతో పాటు పండు ఏర్పడదు. కాయలు కాసే దశలో ఈ వ్యాధి మరింత ఎక్కువగా ఉంటుంది. వ్యాధి కాయలకు సంక్రమిస్తుంది. ఆసమయంలో గోధుమ రంగు మచ్చలు కాయలపై ఏర్పడతాయి. ఇలా కాయమొత్తం బ్యాక్టీరియా సోకి పండ్లు చివరకు కుళ్ళిపోతాయి.
వ్యాధి సోకిన 15 రోజుల తరువాత కొమ్మ పసుపు రంగుతో కూడి ఎండిపోయినట్లుగా మారుతుంది. మరో 15 రోజుల తరువాత ఇతర కొమ్మలు ఎండిపోవటం మొదలవుతుంది. ఈ వ్యాధికి ప్రధానకారణం ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండకపోవటం, మేఘావృత వాతావరణం, వర్షాలు సక్రమంగా కురవకపోవటం, ప్రధానంగా పోషకాల లోపం మొక్కలను బలహీనం చేస్తుంది. తద్వారా వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా గాలితో కూడిన వర్షపు జల్లుల ద్వారా వ్యాపించవచ్చు.
ఈ బ్యాక్టీరియాను నివారించుకునేందుకు మొక్కలు నాటే క్రమంలో నాణ్యమైన ఆరోగ్యకరమైన మొలకలను మాత్రమే ఎంచుకోవాలి. తోట ను శుభ్రంగా ఉంచటంతోపాటు, వ్యాధి సోకిన బాగాలను కత్తిరించి తీసి వేయాలి. కుళ్ళిన పశువుల ఎరువులు,వర్మి కంపోస్ట్ ఎరువులను తగినంత మోతాదులో మొక్కలకు అందించాలి. వ్యాధి నివారణకు సుడోమోనాస్, బాసిల్లస్ , ట్రైకోడెర్మావంటి వాటిని పంటపై పిచికారి చేయటం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టవచ్చు.
COMMENTS