Nagarjuna Konda: వేల ఏళ్ల చరిత్ర చిన్న శాసనంలో నిక్షిప్తం.. ప్రాచీన భాషను డీ కోడ్ చేస్తారా..?
పూర్వ కాలపు జీవన గతులు ఎలా ఉండేవో తెలియాలంటే చరిత్రను వెలికి తీయాల్సిందే. అయితే అప్పటి భాషా ఇప్పటి వారికి అర్థం కావడం కష్ట సాధ్యమే. అయినా పట్టువీడని విక్రమార్కుల్లా ప్రయత్నించి తెలుసుకోవడంలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు భాషా శాస్త్రవేత్తలు. నాగార్జున కొండలో దొరికిన 2వ శతాబ్ధ కాలంనాటి శిలా శాసనం ఢిల్లీ (Delhi) మ్యూజియంలో పదిలంగా ఉంది. అందులో ఏం రాసుందో తెలుసుకోవడానికి ఎన్నాళ్ల నుంచో నానా తంటాలు పడుతున్నారు శాసన నిపుణులు. మొత్తానికి దాన్నిప్పుడు డీకోడ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశంగా ఉన్న నాగార్జున సాగర్ దగ్గరున్న నాగార్జున కొండ చరిత్ర ఇప్పటిది కాదు. ఆదిమ కాలపు మనిషి జంతువులా వేటాడటం నుంచి రాతి పనిముట్లను చేసుకోవడం నాగరికతకు తొలినాళ్లు.
సరిగ్గా ఈ రాతి కాలం నుంచి నాగార్జున కొండలో మనుషులు జీవించేవారిని చరిత్ర చెబుతోంది. అంటే దానికి ముందు నుంచే అక్కడ ఆదిమ మనషి మనుగడ ఉందని అర్థమవుతుంది.
ఒకప్పుడు లోయగా ఉన్న ఈ నాగార్జున కొండ తర్వాత కాలంలో నీటి ముంపునకు గురై ఇప్పుడొక దీవిగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం పురావస్తు ప్రదేశంగా ఉన్న నాగార్జున కొండ తెలుగు నేలను పరిపాలించిన ఇక్ష్వాకులకు రాజధానిగా ఉండేది. ఈ ప్రదేశం పురాతన బౌద్ధ కట్టడాలకు ప్రసిద్ధి. ఇక్కడున్న పురావస్తు సంపద మొదటి శతాబ్ధం నుంచి 3వ శతాబ్ధం మధ్య కాలానిదని చారిత్రక నిరూపణ ఉంది. ఈ ప్రదేశంలో మహాయాన బౌద్ధాన్ని బోధించేవారు నాగార్జునుడు. అందుకే ఈయన పేరుమీద ఉన్న నాగార్జున కొండ పురాతన విశ్వవిద్యాలయంగా పేరు ప్రఖ్యాతులు పొందింది.
పరిశోధకులు అంతకుముందే ఇక్కడ నియోలిథిక్, పాలియోలిథిక్ కాలం నాటి వస్తువులను ఇక్కడ కనుక్కున్నారు. దీని ద్వారానే రాతియుగం నుంచి ఇక్కడ మానవులు జీవించి ఉన్నారని చరిత్ర బయటపడింది. ఇంతటి చరిత్ర ఉన్న నాగార్జున కొండలో దొరికి శిలాశాసనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న శాసనం కూడా ఇక్కడ దొరికిందే. అయితే దీన్ని రిజర్వ్ కలక్షన్ కింద ఢిల్లీ మ్యూజియంలో ఉంచారు.
నాగార్జున కొండలో దొరికిన 2వ శతాబ్ధానికి చెందిన ఈ శాసనం బ్రాహ్మి, ప్రాకృత భాషలో చెక్కి ఉంది. మైసూర్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఎపిగ్రఫీ బ్రాంచ్ ఇందులో ఏం రాసుందో తాజాగా డీకోడ్ చేసింది. శిలాశాసనాల శాఖ డైరెక్టర్గా ఉన్న కె. మునిరత్నం రెడ్డి దీనిపై వివరణ ఇస్తూ, `ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుంచి మాకు ఈ శిలాశాసనం ఫోటోగ్రాఫ్ పంపారు. అయితే నాగార్జున కొండలో దొరికిన దీనిలో ఏముందో అనే విషయాన్ని ఇంత వరకూ గుర్తించలేదు. బ్రాహ్మి, ప్రాకృత భాషలో రాసున్న ఈ శిలాశాసనం బుద్ధపాదకు చెందిన బహుమతిగా రికార్డయి ఉంది` అని తెలియజేశారు.
ఇంతకీ ఇందులో రాసున్న దాన్ని డీకోడ్ చేసిన భాషా పండితులు, ఇందులో `సిద్ధం సకాసా మోడసా బకనాయ బుద్ధయ పటాపాద దేయధమ్మ` అని రాసి ఉన్నట్లు తెలియజేశారు. దీని అర్థం తెలుసుకోవడానికి ప్రస్తుతం వారు ప్రయత్నిస్తున్నారు.
COMMENTS