Horse Grame : ఉలవల సాగులో యాజమాన్యం
Horse Grame : మన రాష్ట్రంలో ఖరీఫ్ మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పనులు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటగా సాగు చేయవచ్చు. ఖరీఫ్ లో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏక పంట గాను వేయవచ్చు. రాగి, జొన్న పంటల్లో సహ పంటగాను వేయవచ్చు. ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల తర్వాత , లేటు ఖరిఫ్ లో ఉలవలు విత్తుకోవచ్చును. అలాగే ఉలవలతో ఇతర అంతర పంటలుగా కాకుండా ఉలవలను పండ్ల తోటలలో అంతర పంటలుగా విత్తుకోన్నచో పచ్చిరోట్ట, పశువుల మేత మరియు భూసారం పెరిగి పండ్ల తోటల ఎదుగుదలకు, దిగుబడికి ఉపయోగపడుతుంది.
తొలకరి పంట తీసిన తర్వాత గాని , వర్షాలు తగు స్ధాయిలో కురవనప్పుడు గాని ఉలవలు విత్తడం జరుగుతుంది. భూమిలో తగినంత తేమ చూసుకొని నాగలితో లేదా కల్టివేటరుతో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారుచేసి విత్తుకోవాలి. నాగలి లేదా గోర్రుతో సాళ్ళ పద్ధతిలో సాళ్ళ మధ్య 30 సెం.మీ. ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదనులో విత్తుకోవాలి. ప్రతి కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండాజిమ్ లేదా థైరమ్ తో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి. సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. ఉలవల సాగులో విత్తనాల ఎంపిక ముఖ్యమైనది. ప్రస్తుతం మార్కెట్లో పి.డి.యం – 1,పి.జడ్.యం. – 1,పి.హెచ్.జి. – 62,పి.హెచ్.జి – 9,సి.ఆర్.హెచ్.జి – 19 విత్తన రకాలు అందుబాటులో ఉన్నాయి.
చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియ దున్నాలి. రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడెర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లర్చాలి. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాల పై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళల్లో పడేటట్లు వేసుకొవాలి.
ఎకరాకు 4 కిలోల నత్రజని, 10 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులు వేయాలి. 10 కిలోల యూరియా, 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. భుసార పరీక్షూ ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. ఉలవలు వర్షాధారంగా లేదా మిగులు తేమ ఆధారంగా ఎక్కువగా పండిస్తారు. కావున విత్తిన తొలి 30-40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు సమస్యాత్మక ప్రాంతాలలో దుక్కి పై ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేల పై పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. అవసరం మేరకు విత్తన 25-30 రోజుల్లో భూమిలో తేమ తగినంతగా ఉన్నప్పుడు అంతరకృషి చేసి కలుపు నివారించి, బోదె ఎక్కించినచో అడపాదడపా కురిసిన వర్షపు నీరు బాగా ఇంకి పంట దిగుడిని పెంచాడానికి దోహదపడుతుంది.
సాధారణంగా మరియు వివిధ నేలలలో పండించే పంట కాని అవసరం మేరకు కీలక దశలలో నీటి తడి ఇచ్చినచో దిగుబడి పెరుగుతుంది. పంట కాలంలో సుమారు 250-300 మి. మీ. నీరు అవసరం. బెట్ట పరిస్థితులో పంటలో హరిత వర్ణం తగ్గిన, మొక్కలు సారం కోల్పోయినచొ మేగ్నిషియం క్లోరైడ్ 6 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు మూడు సార్లు 5 రోజులు వ్యవధిలో పిచికారి చేస్తే బాగా ఫలితం ఉంటుంది.
ఉలవలలో పూత, పిందే సమయంలో కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. వీటి నష్టపరిచే లక్షణాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు, నివారణ చర్యలు పెసర, మినుములో సూచించిన విధంగా పాటించవలెను. పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోవును. క్రమేపి క్రింది నుండి పైకి ఆకులు కూడా హరితాన్ని కోలోయి పూర్తిగా రాలిపోవును. సుమారు 80% వరకుకాయలు ఎండిన తరువాత పంటను కోసినచో నాణ్యమైన దిగుబడి పొందవచ్చు. పంటను కొడవలితో పూర్తిగా మొదలు వరకు పొడి వాతావరణంలో కోయాలి.
కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కళ్లం పై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తోక్కించి లేదా ఆల్ క్రాప్ త్రేషర్ ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు ఎండనిచ్చి గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వ చేయాలి.
COMMENTS