Clostridium : జీవాల ప్రాణాలు తీసే చిటుకు వ్యాధి…కారణాలు..జాగ్రత్తలు
Clostridium : గొర్రెలు, మేకలు పెంపకం వ్యవసాయ ఆధారిత మైన ప్రాంతాల్లో ముఖ్యమైన వృత్తి. ప్రతీఏటా జీవాలలో వచ్చే వివిధ రకరకాల వ్యాధుల వల్ల కారణంగా గొర్రెలు, మేకలను పెంచే రైతులు తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. జీవాలకు వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా చిటుకు రోగం ప్రధానమైనది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు , మేకలు మృత్యువాత పడే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధి జీవాల పెంపకందారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతుంటారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చని పశు వైద్యులు సూచిస్తున్నారు.
జీవాలకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులలో చిటుక వ్యాధి ఒకటి. క్లాఫ్రిడియం జాతికి చెందిన సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే విష పదార్ధం వల్ల చిటుక వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వలన క్షణాల వ్యవధిలో అంటే చిటికె వేసినంత సమయంలోలోనే జీవాలు చనిపోతాయి. అందుకే ఈ వ్యాధికి చిటుక వ్యాధి అని పేరు పెట్టారు. ఈ వ్యాధిని నెత్తి పిడుగు వ్యాధి, గడ్డిరోగం, మెడసారం, పాటు రోగం, ముచ్చు వ్యాధి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా చనిపోతాయి. తొలకరి వరాలు కురిసిన తరువాత జూన్ – జూలై నెలల్లో మొలచే పచ్చిక తిన్న జీవాల్లో వస్తుంది. సాధారణంగా చిటుక వ్యాధి లేత వయసు ఉన్న ధృఢంగా ఆరోగ్యంగా ఉన్న జీవాలలో, వలస గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి గొర్రెలతో పోల్చితే మేకలలో తక్కువగానే కనిపిస్తుంది.
శరీరంలో అంతర పరాన్న జీవులు ఎక్కువగా ఉండడం , గడ్డిని తీసివేసి దాణాను అకస్మాత్తుగా మార్చడం, ఒకేసారి ఎక్కువ పాలు లేదా మేతని పిల్లలకి అందించడం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. సామాన్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవాలు హరాత్తుగా గాలిలోకి ఎగిరి కింద పడి , గిల గిలా కొట్టుకొని, పళ్ళు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. రాత్రి బాగానే ఉండి తెల్లారేసరికి ఎక్కువ సంఖ్యలో జీవాలు చనిపోతాయి. రోగ తీవ్రత తక్కువగా ఉన్న జీవాలకు అధిక జ్వరం ఉంటుంది. వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు అధిక విరోచనాలు, కడుపు నొప్పి, నీరసంగా ఉండడం, సరిగా మేత తినక పోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు. కాళ్ళ బిగిసి నడవటం, కాళ్ళతో పొట్టను తన్నుకోవడం, పళ్ళు కొరకటం, వణకటం, శ్వాస కష్టమవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి
తొలకరిలో జీవాలు అకస్మాత్తుగా ఎక్కువ సంఖ్యలో చనిపోయినప్పుడు చిటుక వ్యాధిగా అనుమానించవచ్చు. ఈ వ్యాధి సోకి మరణించిన గొర్రెలను శవ పరీక్ష చేసినట్లయితే మూత్ర పిండాలు మెత్తబడి గుజ్ఞు ,గుజ్జుగా మారిపోయి ఉంటాయి. పొట్టలో మేత నిండుగా ఉండటం కనిపిస్తుంది. పొట్ట, పేగులలో ఆకుపచ్చ ద్రవం కనిపిస్తుంది. పొట్టమీద, చిన్న పేగు ప్రారంభంలో, గుండెమీద రక్త ప్రావాలు గమనించవచ్చు. పొట్ట, పేగులలో నుండి సేకరించిన మేతను పరీక్షలకు పంపి ఎలీసా వంటి ఇమ్యునోలాజికల్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా మరణిస్తాయి కాబట్టి సాధారణంగా చికిత్స చేసే వ్యవధి ఉండదు. వ్యాధి దీర్ఘకాలికంగా సోక్రిన జీవాలకు పశువైద్యుని సూచన ప్రకారం విరోచనాలు తగ్గడానికి నెబ్లాస్ పౌడర్, ఆంటీబయాటిక్ మందులు నోటి ద్వారా ఇవ్వాలి. రక్తనాళాలలోకి డేక్రోజ్ సెలైన్ను ఎక్కించాలి.
జీవాలకు ప్రతి సంవత్సరం వర్ష రుతువుకు ముందుగా మే మాసంలో చిటుక రోగ నివారణకు టీకాలు వేయించాలి. మరల 15 రోజుల తర్వాత బూస్టర్ డోస్ తప్పకుండా వేయించాలి. తొలకరి వరాలకు మొలిచి వాడిపోయిన లేత గడ్డిని జీవాలు మేయకుండా జాగ్రత్తపడాలి. చిన్న పిల్లలు అధికంగా పాలు తాగకుండా చూసుకోవాలి. పిల్లలు పాలు తాగే స్థితి నుండి మేత, దాణాకు ఒకేసారి మార్చకుండా క్రమ క్రమంగా మార్చుకోవాలి. తొలకరిలో జీవాలు కడుపు నిండా పచ్చిమేత మేయకుండా 3-4 గంటలు మాత్రమే మేసేలా చూడాలి. వర్షాకాలం రాకముందే గొర్రెలలో బద్దె పురుగుల వంటి అంతర పరాన్నజీవుల నిర్మూలనకు నట్టల మందు తాగించాలి.
COMMENTS