Carpet Grass : రైతులకు అదాయ వనరుగా మారిన కార్పెట్ గ్రాస్ సాగు
Carpet Grass : కార్పెట్ గ్రాస్ కు ఇటీవలి కాలంలో మంచి ఆదరణ లభిస్తుంది. చాలా మంది తమ గృహాల్లో ఖాళీ స్ధలాల్లో, కార్యాలయాల్లో పచ్చదనం కోసం ఎక్కవగా కార్పెట్ గ్రాస్ ను పెంచుతున్నారు. పచ్చని గడ్డి నేలంతా పరచివుంటే మనసుకు ఆహ్లాదం కలుగుతుందన్న ఉద్దేశంతో గ్రాస్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు భారీ భవనాలు, పెద్ద పెద్ద హోటళ్లు, పార్కులకే, పరిమితమైనా ఇప్పుడు సాధారణ గృహాలు, ఫ్యాక్టరీల్లోనూ పచ్చదనం కనిపిస్తుంది. దీనికి మంచి డిమాండ్ ఉండటంతో రైతాంగం దీని సాగువైపు దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల రైతుకు కూడా ఆర్థిక భరోసా చేకూరుతుంది. తక్కువ పెట్టుబడితో పరిమిత శ్రమతో అద్భుతమైన లాభాలను రైతులకు లభిస్తుంది.
కొరియన్ కార్పెట్ గ్రాస్ కు ఏడాదంతా భారీ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. దీన్ని సాగు చేయడమూ తేలికే. చీడపీడల బెడద లేదు. క్రిమిసంహారక మందులేయాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా కొంత భూమి, కాస్తంత పెట్టుబడి మాత్రమే. అందుకే ఈ రకం గడ్డిని సాగు చేసేందుకు అనేకమంది మక్కువ చూపుతున్నారు. కొరియన్ కార్పెట్ గ్రాస్ ను సాగుచేయడం కోసం భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మొదటిసారి పంట వేయాలంటే ఎకరానికి దాదాపు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. రెండోసారి ఎకరానికి రూ. 30 వేలు సరిపోతుంది. ఎందుకంటే తర్వాత కొత్తగా విత్తనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎకరానికి 30 వేలు పెట్టుబడి పెడితే, ఆరు నెలల తర్వాత రూ.2 లక్షల దాకా రాబడి పొందవచ్చు.
ఎకరానికి దాదాపు 35 వేల షీట్ల కొరియన్ కార్పెట్ గ్రాస్ వస్తుంది. మార్కెట్ లో ఒక షీటు గడ్డిని నాణ్యతను బట్టి రూ. 6 నుంచి రూ.8 వరకూ అమ్ముకోవచ్చు. అంటే ఒక ఎకరం పంటకు రూ. 2 లక్షలకు పైగా ఆదాయం, పెట్టుబడి మాత్రం ఎకరానికి రూ.30 వేలే, ఇక రైతులే రవాణా చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా కొరియన్ కార్పెట్ గ్రాస్ కు భారీ డిమాండ్ ఉన్నది. మెట్రో నగరాల్లో స్టార్ హోటళ్లు, భారీ భవనాలు, పార్కులకు పచ్చదనమే ప్రాణం కాబట్టి వీటి వాడకం అనివార్యం. కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల ప్రాంగణంలో 30 శాతం మేర పచ్చదనం ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉన్నది. ఫంక్షన్ హాళ్లు, ఏంటి పెరట్లతో పాటు ప్రభుత్వ , ప్రైవేటు కార్యాలయాల్లోనూ గ్రీన్ కార్పెట్ వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో కొరియన్ గ్రాస్ కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి.
కొరియన్ కార్పెట్ ను సాగును గోల్డెన్ క్రాప్ గా చెప్పవచ్చు. కొరియన్ కార్పెట్ సాగు చేయడానికి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. కాబట్టి ఎకరానికంటే కొంత ఎక్కువ భూమిని ఎంచుకోవాలి. ముందుగా పొలాన్ని చదును చేసి కలియదున్నాలి. ఆ తర్వాత భూమిఅంతా తడిసేలా నీళ్లు పెట్టి, మరోసారి దున్నాలి. ఆ తర్వాత భూమి మొత్తం సమానంగా ఉండేలా చూసుకోవాలి. గడ్డిని విత్తడానికి ముందే పశువుల పేడను ఎరువుగా వేయాలి. తర్వాత గ్రోమోర్, డీఏపీ లాంటి రసాయన ఎరువులను వేసుకోవాలి. ఆపైన కొరియన్ గ్రాస్ మొక్కలను బాగా కడిగి, నాటు మాదిరిగా వేసుకోవాలి. ఈ పంట సాగుకు నీటి అవసరం కూడా ఎక్కువ ఉండదు. చలికాలం, వర్షా కాలంలో వారానికి రెండుసార్లు నీళ్లు పడితే చాలు. ఎండాకాలంలోనైతే రెండురోజులు ఒకసారి నీళ్లు పట్టాల్సి ఉంటుంది. రైతులకు చీడపీడల బెడద ఉండదు. చెదలు వచ్చే ప్రమాదం మాత్రం లేకపోలేదు. చెదలు నివారణకు టిమెట్ మందులను కొడితే సరిపోతుంది. ఆరు నెలల తర్వాత పంట చేతికొస్తుంది.
తెలంగాణా ప్రాంతంలోని చాలా మంది రైతులు ఇప్పటికే ఈ గ్రాస్ పెంపకం చేపట్టి మంచి అదాయాన్ని గడిస్తున్నారు. మంచి డిమాండ్, భారీ లాభాలు ఉండటంతో కొరియన్ గ్రాస్ సాగును కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు గోవా, మహారాష్ట్ర, నాగపూర్, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, కర్నూలు, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ గడ్డిని సరఫరా చేస్తున్నారు. నష్టభయంలేని రాబడిని కండ్ల చూడాలనుకునే రైతులు కొరియన్ గ్రాస్ పెంపకం వైపు దృష్టి పెట్టటం సరైన ఆలోచనగా చెప్పవచ్చు.
COMMENTS