World Parkinson's Day 2024 : చికిత్స లేదు, తినే ఆహరమే పార్కిన్సన్స్ వ్యాధికి ఔషధం
World Parkinson's Day 2024 : నాడీ వ్యవస్థకు సంబంధించిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్య న్యూరోడెజెనరేటివ్ వ్యాధి గురించి విస్తృతమైన అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 11న 'ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం' గా పాటిస్తున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకుంటే నివారించవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు.
పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక రుగ్మత. ఇది ప్రధానంగా శరీర అవయవ చలనమును ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ న్యూరోసైకియాట్రిక్ సమస్యలు అంటే మానసిక స్థితి మందగించడం, ప్రవర్తనలో మార్పులు, వాసన కోల్పోవడం, నిద్రలేమి సమస్యలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పార్కిన్సన్స్ వ్యాధి ప్రారంభదశలో వణుకు, బిగుసుకు పోవడం , కదలిక మందగించడం, నడకలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ఈ వ్యాధితో బాధపడే రోగుల మొఖాల్లో ఎల్లప్పుడు విచారం, ఆందోళన ఉంటాయి.మాట్లాడటం మొదలుకొని నడవటం వరకు శరీరంలోని అనేక వ్యవస్థల్లో అసమతుల్యత కనిపిస్తుంది.
ఈ న్యూరోడెజెనరేటివ్ వ్యాధి గురించి విస్తృతమైన అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా ఏప్రిల్ 11న 'ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం' గా పాటిస్తున్నారు.
మెదడులో 'సబ్స్టాంటియా నిగ్రా' అని పిలిచే డోపమైన్-ఉత్పత్తి చేసే కణాలు క్షీణించడం ప్రారంభించినప్పుడు ఈ న్యూరోడెజెనరేటివ్ మూవ్మెంట్ డిజార్డర్ ఏర్పడుతుంది. ఇది ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారిని ప్రభావితం చేస్తుంది, అయితే కొన్నిసార్లు యువకులు కూడా పార్కిన్సన్స్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది. దురదృష్టవశాత్తూ ఈ వ్యాధికి చికిత్స లేదు. కానీ తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా పరిస్థితిని కొంతవరకు నివారించవచ్చు.
ఏవి తినాలి.. ఏవి తినొద్దు!
చేప నూనెలు, ఫావా బీన్స్, యాంటీఆక్సిడెంట్-రిచ్ మీల్స్, విటమిన్లు B1, C, D కలిగిన ఆహార పదార్థాలు తీసుకుంటే పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలను అదుపుచేయవచ్చునని న్యూఢిల్లీలోని పోర్వూ ట్రాన్సిషన్ కేర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న రోగులు ఎక్కువగా ఒమేగా-3-రిచ్ కొవ్వు చేపలను తినడం లేదా ఒమేగా-3 సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చునని డాక్టర్ సంతోష్ తెలిపారు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు నరాల వాపును తగ్గించడానికి, న్యూరోట్రాన్స్మిషన్ను పెంచడానికి, న్యూరోడెజెనరేషన్ను నిలువరించడానికి ఇవి తోడ్పడతాయని అధ్యయనాలలో తేలింది. సాల్మన్ చేప, టునా చేప, ఫ్లాక్స్ విత్తనాలు, వాల్నట్స్ మొదలగు వాటిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
ఉప్పు, చక్కెరలు తగ్గించాలి
తినే ఆహారంలో చక్కెర, సోడియం కలిగిన ఉప్పు తీసుకోవడం పరిమితం చేయాలి. అలాగే ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ముదురు రంగు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. అదే సమయంలో కృత్రిమంగా తయారుచేసే ఆహారపదార్థాలకు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సిఫారసు చేస్తున్నారు.
మృదువైన ఆహారాలు తినాలి
పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారిలో నమలడం, మింగడం కష్టంగా ఉంటుంది. ఫలితంగా అవి ఇతర అనారోగ్య సమస్యలను సృష్టించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మింగటానికి కష్టంగా ఉండే మాంసాహార పదార్థాలు, ఇతర కఠినమైన ఆహారపదార్థాలను తీసుకోవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.
COMMENTS